కరీంనగర్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతులు ఇప్పుడిప్పుడు యాసంగి సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో మొన్నటి వరకు వరికోయగా, మిగిలిన కొయ్యకాళ్లు లేకుండా చేసేందుకు చాలా మంది నిప్పు పెడుతున్నారు. ప్రతి సీజన్లోనూ ఇలా చేస్తుండడంతో అనేక అనర్థాలు జరుగుతున్నాయి. నేలకు సారాన్ని చేకూర్చే క్రిమికీటకాలు నశించిపోవడంతోపాటు వాయు కాలుష్యం పెరిగిపోతున్నది. భూ సమతుల్యత దెబ్బతింటూ, మరో పంటపై తీవ్ర ప్రభావం పడుతున్నది. ఒక్కోసారి రైతుల ప్రాణాలకూ ముప్పు ఏర్పడుతున్నది. వరికొయ్యలు కాల్చడం కర్షకుడికి తెలియకుండానే తీరని నష్టాన్ని మిగులుస్తుండగా, తగులబెట్టకుండా పొలంలో కలియదున్నితే ఎంతో మేలు జరుగుతుందని అధికారులు సూచిస్తున్నారు.
పొలం కోసిన తర్వాత గడ్డిని గతంలో రైతులు ఎంతో జాగ్రత్తగా కాపాడుకునేవారు. ధాన్యం తడిచినా పెద్దగా ఇబ్బంది పడకపోయినా.. గడ్డి తడిస్తే మాత్రం చాలా మదనపడేవారు. పశువుల కోసం అంతలా ఆరాటపడేవారు. పోచ.. పోచ జమచేసి కప్పేసి ఏడాదంతా మేతకు వాడేవారు. అయితే, కాలక్రమేనా పశువుల వినియోగం తగ్గడం, మిషన్ల వాడకం పెరగడంతో ఇప్పుడు అదే గడ్డిని మడిలోనే తగుల బెడుతున్నారు. పర్యావరణ కాలుష్యానికి కారణం అవుతున్నారు. కాల్చడం వల్ల అపార నష్టాలున్నయంటూ శాస్త్రవేత్తలు పదే పదే చెబుతున్నా మెజార్టీ రైతులు వరికొయ్యలను, గడ్డిని తగుల పెడుతూనే ఉన్నారు. తద్వారా తాను తీసుకున్న గొయ్యిలో తానేపడ్డట్లు అవుతున్నది. రైతన్న పరిస్థితి. ఈ విధానం వల్ల ప్రకృతి దెబ్బతినడమేకాదు, అన్నదాత అన్ని రకాలుగా నష్టపోతున్నాడు. పంటకు మేలుచేసే సూక్ష్మజీవులు చనిపోవడమేకాదు, సారవంతమైనభూమి దెబ్బ తింటుంది. దిగుబడిపై ప్రభావం చూపుతుంది. వాతావరణం కలుషితం అవుతుంది. చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే వరి కొయ్యలే సిరులు కురిపిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
నాడు పశువులకు మేత.. నేడు కాలి బూడిద..
నాడు వరిని కొడవళ్లతో మొదళ్ల వరకు కోసేవారు. అప్పట్లో రైతన్న ఇంట ఉన్న పశువుల మేత కోసం పశుగ్రాసాన్ని కుప్పలు (గడ్డివాములు) పెట్టుకునేవారు. చిన్న గడ్డి పోచను కూడా విడిచి పెట్టకుండా.. ఎండబెట్టి కుప్పవేసి ఏడాదంతా పశువులకు మేతగా ఉపయోగించే వారు. కానీ, ప్రస్తుతం వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరిగింది. దాంతోపాటే పశువుల సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. రైతుకు గడ్డి అవసరం లేకుండా పోయింది. వరికోత యంత్రాలు వచ్చిన తర్వాత వరిని కొడవళ్లతో కాకుండా యంత్రాలతో కోస్తున్నారు. ఈ యంత్రాలు మొదళ్ల వరకు కాకుండా 25 నుంచి 30 సెంటీమీటర్ల ఎత్తులో కోస్తున్నాయి. దాంతో కొయ్యకాళ్లు మిగిలిపోతున్నాయి. దీనిని అలా గే వదిలేస్తే వ్యర్థ పదార్థంగా మారి పంట అవశేషంగానే మిగిలిపోతుంది. పంటకు-పంటకు మధ్య సమయం తక్కు వ ఉండడంతో ఈ కొయ్యకాళ్లు, వరిగడ్డిని కంపోస్టుగా మార్చుకోవడంపై రైతులకు అవగాహన లేక తగుల పెడుతున్నారు. దీనివల్ల నష్టాలే తప్ప లాభం ఏమా త్రం ఉండదని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒక్కోసారి కాల్చే పొగతో రైతు ఊపిరాడక చనిపోయిన సందర్భాలున్నాయని వివరిస్తున్నారు.
గతంలో పలువురు రైతుల మృతి
గతేడాది మే 12న ఇల్లంతకుంట మండలం రహీంఖాన్పేటలో వరి కొయ్యలకు నిప్పు పెట్టి ఊపిరాడక గుండ ఎంకవ్వ(55) మృతి చెందింది. జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తికి చెందిన పోతుగంటి లక్ష్మణ్ (65) సైతం గతేడాది యాసంగి సీజన్లో కొయ్యకాళ్లను తగులబెట్టగా, ఒక్కసారిగా మంటలు చెలరేగా యి. పక్కనే ఉన్న గడ్డికుప్పలకు మంటలు అంటుకుంటాయనే భయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించే క్రమంలోనే నిప్పంటుకొని ప్రాణాలు కోల్పోయాడు. గతంలో మానకొండూర్ మండలం మద్దికుంట చెందిన ఓ రైతు ఊపిరాడక చనిపోయాడు.
విపరీతమైన నష్టాలు