కరీంనగర్ విద్యానగర్, జనవరి 10: అవసరం లేకపోయిన సీ-సెక్షన్ ఆపరేషన్ ద్వారా ప్రసవాలను చేసే డాక్టర్లు, దవాఖానలపై చర్యలు తీసుకోవాలని అధికారులను వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగేలా విధులు నిర్వర్తించాలని సూచించారు. కరీంనగర్ కలెక్టరేట్లో వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై బుధవారం రాత్రి కలెక్టర్, వైద్య శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ప్రైవేటు దవాఖానలు, ల్యాబ్లపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. సరైన అనుమతులు, అవసరమైన వైద్యులు మొదలైనవి లేకుండా ఐవీఎఫ్, ఐయూఎఫ్ను అందించే దవాఖానలను గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో లింగనిర్ధారణ, అబార్షన్ చేసే వారిపై కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉండాలని ప్రవేశపెట్టిన ఆరోగ్యమహిళా కార్యక్రమాన్ని జిల్లాలోనే మొదటగా ప్రవేశపెట్టామన్నారు. ప్రాథమిక దవాఖానల్లో కొన్ని రకాల ఆరోగ్యశ్రీ సేవలను అందించేలా తీర్చిదిద్దాలన్నారు. వైద్యశాఖ ద్వారా జరిగే ప్రతి పని సంబంధిత పోర్టల్లో నమోదు కావాలని ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా వైద్యాధికారి లలితాదేవి, సూపరింటెండెంట్ వీరారెడ్డి వైద్యాధికారులు పాల్గొన్నారు.