చందుర్తి, డిసెంబర్ 18: తిరుపతి గతంలో ఉపాధి లేక గల్ఫ్బాట పట్టాడు. తల్లి ఆరోగ్య పరిస్థితి బాగాలేక స్వదేశానికి తిరిగివచ్చాడు. ఆయనకు మూడున్నర ఎకరాల భూమి ఉన్నది. తిరుపతికి చిన్నప్పటి నుంచి ఎవుసం అంటే చాలా ఇష్టముండేది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో మెట్ట ప్రాంతమైన చందుర్తి మండలానికి గోదావరి జలాలు రావడంతో సాగునీటికి కష్టాలు తీరాయి. దీంతో తనకున్న మూడు ఎకరాల్లో వరి, 20 గుంటల్లో గత ఆగస్టు నెలలో బంతిపూల తోటను సాగు చేశాడు.
ఇందు కోసం 32వేల పెట్టుబడి పెట్టాడు. ప్రస్తుతం బంతి పూలను సమీప మార్కెట్ విక్రయిస్తున్నానని, అయ్యప్ప దీక్షలు, సంక్రాంతి పండుగల నేపథ్యంలో గిరాకీ బాగుందని రైతు తిరుపతి సంతోషంగా చెబుతున్నాడు. వరి, పూలు, కూరగాయలు పండిస్తున్నానని, మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ కావడం ఆనందంగా ఉందని అంటున్నాడు. సమీప గ్రామాల యువకులు ఫొటో షూట్ కోసం తన తోటల్లోకి రావడం సంతోషంగా ఉందని చెబుతున్నాడు.
మూడపల్లికి చెందిన రైతు పుల్కం తిరుపతి మూస సాగుకు స్వస్తి చెప్పి.. సిరులు కురిపించే బంతి, కూరగాయల సాగుపై దృష్టిపెట్టాడు. పండుగలకు పంట చేతికందేలా పూదోటను వేసి.. స్థానిక మార్కెట్లో విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నాడు. కష్టానికి తగిన ఫలితం రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.