మల్యాల, మే 30: కొండగట్టు అంజన్న సన్నిధిలో గురువారం హనుమాన్ పెద్ద జయంత్యుత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. మూడు రోజుల పాటు వేడుకలు జరగనుండగా తొలిరోజూ రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర రాష్ర్టాల నుంచి తరలివచ్చిన అంజన్న దీక్షాపరులు, భక్తులతో కొండంత కిటకిటలాడింది. అర్చకులు, వేదపండితులు మూల విరాట్కు ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలను ప్రారంభించారు. తొలిరోజు భద్రాద్రి ఆలయ ఈవో రమాదేవి, ఉప ప్రధాన అర్చకులు గోపాలకృష్ణాచార్యులు, అర్చకుడు అమరవాది వెంకట రాఘవన్ ఆంజనేయస్వామికి పట్టువస్ర్తాలు సమర్పించారు. వీరికి హనుమాన్ ఆలయ ఈవో ఆకునూరి చంద్రశేఖర్, ఉత్సవ ప్రత్యేకాధికారి వినోద్రెడ్డి నేతృత్వంలో భక్తులు ఎదుర్కొళ్లతో అపూర్వ స్వాగతం పలికారు.
కళాకారుల కోలాటాలు, ఒగ్గుడోలు విన్యాసాలు, శివసత్తుల పూనకాల నడుమ భద్రాద్రి ఆలయ పట్టు వస్ర్తాలను ఎదుర్కొన్నారు. అర్చకులు మూల విరాట్కు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆశీర్వచన మండపంలో ఉత్సవమూర్తులను పల్లకీపై ఉంచి స్వస్తి వచనం, రక్షాబంధనం, రుత్విక్ వరణం, అరుణి మథనం తదితర పూజాది కార్యక్రమాలు చేశారు. పట్టువస్ర్తాలు సమర్పించిన భద్రాద్రి ఆలయ అధికారులు, అర్చకులను హనుమాన్ ఆలయ కమిటీ ఘనంగా సత్కరించగా అర్చకులు పూజలు చేయించి తీర్థప్రసాద వితరణ చేశారు. ఉత్సవాల తొలిరోజే మాల విరమణ మండపాన్ని తెరిచారు. పెద్దసంఖ్యలో దీక్షాపరులు చేరుకొని దీక్షలను విరమించారు.