జూలపల్లి, డిసెంబర్ 6:సర్కారు కళాశాలల్లో ప్రవేశపెట్టిన వృత్తి విద్యా కోర్సులకు ఆదరణ పెరుగుతున్నది. పెద్దపల్లి జిల్లాలోని 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఒకేషనల్ కోర్సులను ప్రవేశపెట్టగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉపాధి పొందేందుకు ప్రధానంగా గ్రామీణ యువత మొగ్గు చూపుతున్నది. సాంకేతిక నైపుణ్యం కలిగిన వృత్తిలో శిక్షణ ఇప్పించడంతో పాటు ఏటా ప్రభుత్వం జాబ్ మేళాలు నిర్వహిస్తుండడంతో పెద్ద సంఖ్యలో యువత ఉపాధి పొందుతున్నది.
గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల నుంచి వృత్తి విద్య కోర్సులకు ఆదరణ పెరుగుతున్నది. పేద యువతీయువకులు సులభంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉపాధి, ఉద్యోగాలు పొందేందుకు వృత్తి విద్య కోర్సులవైపు మొగ్గు చూపుతున్నారు. ఇంటర్ బోర్డు ఏటా జాబ్ మేళా ఏర్పాటు చేసి ఉద్యోగాల కల్పనకు దారి చూపుతున్నది. పెద్దపల్లి జిల్లాలోని 10 ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో ప్రభుత్వం ఒకేషనల్ కోర్సులను ప్రవేశపెట్టింది. సాంకేతిక నైపుణ్యం కల్గిన వృత్తిలో శిక్షణ ఇప్పించి, విద్యార్థులకు ఉపాధి మార్గం చూపించడంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. శిక్షణ పూర్తి చేసిన తర్వాత ప్రైవేటు కంపెనీల్లో యువతీ యువకులకు ఉపాధి కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ క్రమంలో గోదావరిఖని, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్, జూలపల్లి, ధర్మారం, రామగుండంలోని ప్రభుత్వ కళాశాలల్లో ఒకేషనల్ కోర్సులు నిర్వహిస్తున్నారు. ఎంపీహెచ్డబ్ల్యూ (మహిళలు), వోఏ, ఫిజియోథెరపీ, కంప్యూటర్ గ్రాఫిక్స్, కంప్యూటర్ సైన్స్, టూరిజం, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కోర్సులు కొనసాగుతున్నాయి. ఒక్కో కళాశాలలో రెండేళ్ల వృత్తి విద్య కోర్సుల్లోని వివిధ విభాగాల్లో 30 నుంచి 40 మంది చొప్పున విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నారు. ఇక్కడ విద్యార్థులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ దవాఖానలు, విద్యుత్ సబ్స్టేషన్లో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. వృత్తి విద్య అభ్యసించి ఉత్తీర్ణులైన విద్యార్థులు పలు సంస్థల్లో ఉద్యోగాలు సంపాదించి జీవితంలో స్థిరపడుతున్నారు. జూలపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి, కుమ్మరికుంట గ్రామానికి చెందిన న్యాతరి ఆదిత్య ఈటీ విభాగంలో 2019-2021 విద్యా సంవత్సరానికిగానూ రాష్ట్రస్థాయి మొదటి ర్యాంక్ సాధించాడు. ఇక్కడి కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. విద్యార్థుల ప్రాక్టికల్ అవసరాలు తీర్చేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో దాదాపు. రూ. 40 వేలు సొంత ఖర్చులు భరించి సామగ్రి కొనుగోలు కళాశాలలో ఏర్పాటు చేశారు.
అన్ని వసతులున్నాయి..
ప్రభుత్వం రెండేండ్ల క్రితం జూలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ కోర్సుల నిర్వహణకు అనుమతి ఇచ్చింది. రెండు సంవత్సరాల ఈటీ, ఎంఎల్టీ కోర్స్ల్లో 140 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. అన్ని వసతులు కల్పించాం. దూర ప్రాంతాల నుంచి విద్యార్థులు కళాశాలకు వస్తున్నారు. చొప్పదండి, ధర్మారం, ఎలిగేడు, జూలపల్లి మండలాల్లోని ఆర్నకొండ, వెదురుగట్ట, కొత్తూరు, ధూళికట్ట ప్రాంతాల విద్యార్థులు ప్రైవేటు వాహనాలు సమకూర్చుకుని తరగతులకు హాజరవుతున్నారు. ఒకేషనల్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఉపాధి పొందేందుకు కృషి చేస్తున్నాం, ఉద్యోగాల కల్పనకు ప్రైవేటు కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఇప్పటివరకు 15 మంది ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగం చేస్తున్నారు.
శిక్షణ బాగుంది…
మాది చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామం. నేను జూలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంఎల్టీ విద్యార్థిని. ఒకేషనల్ కోర్స్ పూర్తి చేసి ఉద్యోగం చేయాలని ఉంది. ఇక్కడ మా లెక్చరర్లు శిక్షణ బాగా ఇస్తున్నారు. జీవితంలో త్వరగా స్థిరపడేందుకు ఒకేషనల్ కోర్సులు చక్కటి మార్గం. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు పొందేందుకు వృత్తి విద్య కోర్సుల ద్వారా అవకాశం ఉంది.