హుజూరాబాద్ టౌన్, నవంబర్ 27 : భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈనెల 26, 27న హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన ఓటరు నమోదు ప్రతేక కార్యక్రమానికి ప్రజల నుంచి చక్కని స్పందన లభించిందని హుజూరాబాద్ ఆర్డీవో బీ హరిసింగ్ ఆదివారం తెలిపారు. అర్హుల నుంచి బీఎల్వోలు అర్జీలు, అభ్యంతరాలు స్వీకరించారని తెలిపారు. ఇందులో భాగంగా ఫారం 6 (కొత్త ఓటర్ నమోదు కోసం) 1332 మంది, ఫారం 7 (తొలగింపులు) 172 మంది, ఫారం 8(సవరణ) 61 మంది నియోజకవర్గంలో దరఖాస్తులు సమర్పించారన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని సూపర్వైజర్లు, సంబంధిత తహసీల్దార్లు పాల్గొన్నారని, ఓటరు నమోదు అధికారిగా, రెవెన్యూ డివిజన్ అధికారిగా హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ స్టేషన్లను సందర్శించి, పర్యవేక్షించినట్లు ఆయన తెలిపారు.
వీణవంక, నవంబర్ 27 : ఓటరు నమోదు కార్యక్రమాన్ని పురస్కరించుకొని పోలింగ్ కేంద్రాల వద్ద జరుగుతున్న ఓటరు నమోదును ఆదివారం హుజూరాబాద్ ఆర్డీవో హరిసింగ్ సందర్శించారు. మండలంలోని వల్భాపూర్, నర్సింగాపూర్, వీణవంక, రామకృష్ణాపూర్ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆర్డీవో సందర్శించి బీఎల్వోను ఓటరు నమోదు ఎంత వరకు అయిందో అడిగి తెలుసుకున్నారు. ఓటరు నమోదుపై యువతలో అవగాహన కల్పించాలని, 18 ఏండ్లు నిండిన యువతీయువకులు ఓటరు నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజయ్య, ఆర్ఐలు రవి, ప్రవీణ్, బీఎల్వోలు పాల్గొన్నారు.
ఇల్లందకుంట, నవంబర్ 27 : మండలంలోని రాచపల్లిలో ఆర్ఐ రవీందర్ ఓటుహక్కు నమోదుపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆదివారం ఆర్ఐ ఓటు నమోదుపై అవగాహన కల్పించి, యువతీయువకులతో ఓటు హక్కును నమోదు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కోరారు. ఇక్కడ గ్రామస్తులు పాల్గొన్నారు.