తెలంగాణచౌక్, ఆగస్టు 5: రాఖీ పండుగ సందర్భంగా టీఎస్ ఆర్టీసీ మహిళలకు నూతన కానుక ప్రకటించింది. రూ.40కే రాఖీని రాష్ట్రంలోని అన్ని కార్గో సర్వీస్ సెంటర్లకు పంపిస్తామని కార్గో జోనల్ డిప్యూటీ సీటీఎం మధుసూదన్ తెలిపారు. శుక్రవారం కార్గో కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ సోదరులకు రాఖీ కట్టేందుకు దూర ప్రాంతాలకు వెళ్లలేని మహిళలకు ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు.
కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపోల కార్గో కేంద్రాలతో పాటు 57 బుకింగ్ పాయింట్ల ద్వారా రాఖీలను తీసుకుంటామని పేర్కొన్నారు. వీటితో పాటు ఆదివారం నుంచి ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే రూ.90 చెల్లిస్తే పొరుగు రాష్ర్టాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని కార్గో కేంద్రాలకు రాఖీలను బట్వాడా చేస్తామని చెప్పారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరల్లో హోమ్ డెలివరీ సదుపాయం ఉందని, ఇందుకు అదనపు చార్జీ ఉంటుందని వివరించారు. టీఎస్ ఆర్టీసీ లాభాపేక్ష లేకుండా అందిస్తున్న ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.