సిరిసిల్ల, మార్చి 2 : ఈ ఫొటోలు చూశారా..? అచ్చం విద్యార్థులు బస్సెక్కి స్కూలుకు పోతున్నట్లు, దిగి వస్తున్నట్లు ఉంది కదా.. ఇది బస్టాప్ అనుకుంటున్నారా..? అలా అనుకుంటే మీరు పొరబడినట్లే.. ఇవి అందంగా తీర్చిదిద్దిన తరగతి గదులు. విద్యార్థులను ఆకర్షించేలా మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా పాఠశాలలను అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలో ముస్తాబాద్ మండలం గూడెంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఇలా ఆకర్షణీయంగా మార్చారు.
గివ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీఎస్ఆర్ నిధులతో మూడు బస్సుల బడిగా మార్చారు. గంభీరావుపేట మండలం నర్మాలకు చెందని చిత్రకారుడు నారోజు చంద్రశేఖర్ మూడు తరగతి గదులను అందమైన రంగురంగుల పెయింటింగ్స్తో మెట్రో, పల్లెవెలుగు, సిటీ బస్సుల్లా తీర్చిదిద్దారు. తమ తరగతి గదులు ఆకర్షణీయంగా ఉండడంతో విద్యార్థులు నిత్యం పాఠశాలకు రావడానికి ఉత్సాహం చూపుతున్నారు.