కరీంనగర్, జనవరి 8 (నమస్తేతెలంగాణ ప్రతినిధి)/కరీంనగర్(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రైవేటుకు దీటుగా నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక రకాల చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగా ఆంగ్ల విద్యను అమల్లోకి తెచ్చింది. దీంతో పాటు.. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించేందుకు.. ‘మన ఊరు- మన బడి’ పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 26 వేల పైచిలుకు పాఠశాలల్లో నాణ్యమైన విద్యతోపాటు డిజిటల్ విద్యా విధానాన్ని దశలవారీగా ప్రవేశపెట్టి విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాన్ని పెంచాలన్నదే ప్రధాన లక్ష్యంగా మూడు దశల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం కావాల్సిన మౌలిక వసతుల కల్పన కోసం రూ.7,269 కోట్లకు గతంలోనే మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిపిందే.
ఉమ్మడి జిల్లాలో 867 బడుల ఎంపిక
‘మన ఊరు-మన బడి’ పథకం ఫేజ్-1 కింద ఉమ్మడి జిల్లాలో 867 బడులను ఎంపిక చేశారు. రూ.300 పై చిలుకు కోట్లతో మౌళిక వసతుల కల్పనకు పనులు జరుగుతున్నాయి. పనులను రెండు రకాలుగా వర్గీకరణ చేశారు. మౌళిక వసతుల కోసం రూ.30 లక్షలలోపు, రూ.30 లక్షలకు పైబడి అంటూ రెండు రకాలుగా వర్గీకరణచేసి పనులు మంజూరు చేశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 867 బడుల్లో 93 పాఠశాలల్లో రూ.30 లక్షలకు మించి ఖర్చు చేస్తుండగా, మిగిలిన ఒక్కో పాఠశాలలో రూ.30 లక్షలతో వసతులు కల్పిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే కొన్ని మండలాల్లో పనులు పూర్తయ్యాయి. వాటిలో కొన్నింటిని సోమవారం ప్రారంభించనుండగా, మిగిలిన వాటి పనులను ఈ నెలాఖరులోపు పూర్తిచేయాలన్న లక్ష్యంతో అన్ని జిల్లాల అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలాఖరులోపు పూర్తిచేయాలంటూ ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. పనులు పూర్తయిన వాటి ప్రారంభోత్సవాలు దశలవారీగా చేస్తూ వినియోగంలోకి తేవాలన్న అదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేయడంతోపాటు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
.. ఇక్కడ కనిపిస్తున్న భవనం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కుసుమ రామయ్య జడ్పీ హైస్కూల్. మొన్నటి దాకా అరకొర వసతులతో అధ్వానంగా ఉండేది. 450మంది చదువుతున్న ఈ పాఠశాలలో రెండేరెండు మూత్ర శాలలుండేవి. రంగు వెలిసిపోయి అంధవికారంగా కనిపించేది. ప్రహరీ లేకపోవడంతో పశువులు లోపలికి వచ్చి విద్యార్థులను ఇబ్బంది పెట్టేవి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు-మన ‘బడి’ కింద బడికి జీవం వచ్చింది. రూ.11.50 లక్షలు మంజూరు చేసి పనులు చేపట్టారు. 15 మూత్రశాలలు నిర్మించారు. ప్రతి తరగతి గదిలో ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. బోరు మోటారు బిగించి, ప్రహరీ కూడా నిర్మించారు. తరగతి గదులు, బడి భవనానికి మల్టీకలర్స్ వేశారు. ఆకర్షణీయమైన బొమ్మలతో విద్యార్థులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. బడిలోని అన్ని తరగతులకు సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు భవనం పై పలకలు ఏర్పాటు చేశారు. త్వరలో మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలకు సంజీవనిలాంటిది..
మన ఊరు- మన బడి కార్యక్రమం పాఠశాలలకు సంజీవని లాంటిది. వెలిసిన గోడలతో, సౌకర్యాల లేమితో కనిపించిన పాఠశాలలు నేడు సర్వాంగ సుందరంగా మారుతున్నాయి. ఇన్నేళ్లు స్కూళ్లలో మౌలిక వసతులు లేక అడ్మిషన్లు తగ్గిపోయాయి. చాలా సార్లు పాఠశాలల్లో వసతులు లేవని ఎంతో మంది తల్లిదండ్రులు అడ్మిషన్లు క్యాన్సల్ చేసుకున్నారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక పడ్డ అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు ప్రభుత్వం తెచ్చిన పథకంతో పాఠశాలలన్నింటికీ ఊతం వచ్చింది. లక్షల రూపాయల నిధులతో సరికొత్త అందాలను సంతరించుకుంటున్నాయి. పెంబట్ల పాఠశాలలో దాదాపు రూ.11 లక్షలతో అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు మా పాఠశాలను చూస్తే మాకే ఉత్సాహం వస్తోంది.
– గోవర్దన ప్రసాద్, హెచ్ఎం, పెంబట్ల ఎంపీపీఎస్, సారంగాపూర్ మండలం, జగిత్యాల జిల్లా
పాతబడికి కొత్తరూపం
“ఎప్పుడో పదిహేనేండ్ల కింద వేసిన రంగులతో కళావిహీనమైన గోడలు. ఇపుడు రంగు రంగుల పెయింటింగ్తో కొత్త కళను సంతరించుకున్నాయి. దశాబ్దాల కింద నిర్మించిన గదుల రూఫ్లు వర్షం వస్తే జలించి పిల్లలు కూర్చునే పరిస్థితి ఉండేది కాదు. నిర్మించినప్పుడు రంగులు వేసిన ప్రహరీకి మళ్లీ కొత్త రంగులు అద్దుకున్నాయి. ఇప్పుడు ఈ పాఠశాలను చూస్తే ఇది ఆ స్కూలేనా అనిపించేలా మారిపోయింది. అదే గంగాధరలోని ప్రాథమిక పాఠశాల. ‘మన ఊరు – మన బడి’ కింద రూ.8.28 లక్షలతో పనులు చేపట్టారు. జలిస్తున్న స్లాబ్ను పునరుద్ధరించారు. విద్యుత్తు మరమ్మతులు చేపట్టారు. పగిలిపోయిన తలుపులు, కిటికీల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశారు. నీళ్ల కోసం సంప్ నిర్మించారు. తాగు నీటి కోసం కుళాయి ఏర్పాటుచేశారు. టాయిలెట్స్ మరమ్మతులు జరుగుతున్నాయి. పాఠశాలకు, దాని చుట్టూ ఉన్న ప్రహరీకి మల్టీ కలర్స్ వేయడంతో పాఠశాల సరి కొత్తగా కనిపిస్తోంది. ఇలా కరీంనగర్ జిల్లాలో 651 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా తొలి దశలో 120 ప్రాథమిక, 16 ప్రాథమికోన్నత, 94 ఉన్నత పాఠశాలలను ఎంపిక చేయగా, వీటికి అవసరమైన మౌలిక సదుపాయాలను గుర్తించి రూ. 31 కోట్లతో 12 రకాల పనులను చేపట్టారు.
12 రకాల సౌకర్యాలు
ఈ పథకం కింద ఎంపిక చేసిన పాఠశాలలకు 12 రకాల సౌకర్యాలు సమకూరనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
సరి కొత్తగా చింతకుంట బడి
“జిల్లా కేంద్రమైన కరీంనగర్కు కూత వేటు దూరంలో ఉన్న కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలోని ఈ బడి నిన్నా మొన్నటి వరకు అధ్వాన్నంగా ఉండేది. పరిసరాల్లో చెత్తాచెదారం ఉండి విద్యార్థులు బయట తిరిగే పరిస్థితి ఉండేది కాదు. 240 మంది విద్యార్థులు ఉన్న ఈ ప్రాథమిక పాఠశాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు మన బడి’ కింద ఎంపిక చేశారు. రూ.4,44,800 కేటాయించి పనులు చేపట్టారు. వివిధ పనులు పూర్తయినకొద్దీ ఈ పాఠశాల స్వరూపమే మారిపోతోంది. పనులు చివరి దశకు చేరుకున్నాయి. విద్యుత్తు వైరింగ్ పునరుద్ధరించారు. మూత్రశాలలో టైల్స్ వేశారు. కార్యాలయంతో పాటు ఐదు తరగతి గదులను మల్టీ రంగులతో తీర్చిదిద్దారు. పాఠశాల భవనంపై వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశారు. సంప్లో మోటర్ బిగించారు. బడి గ్యాలరీలో ఆకర్శణీయమైన బొమ్మలు వేసే పనులు మాత్రమే మిగిలాయి. ఇపుడు ఈజీఎస్లో పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మిస్తుండడంతో పాఠశాలకు అదనపు సదుపాయం సమకూరనున్నది.”
.. ఇది సారంగాపూర్ మండలం పెంబట్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల. ఇది మూడు నెలల కిందటి వరకు ఒక సాధారణ స్కూల్. రంగులు వెలిసిన గోడలు, నీటి సౌకర్యం లేక తాళం వేసిన మూత్రశాలలు, విద్యుత్ సౌకర్యం లేక సాయంత్రం అయితే చాలు చీకట్లు కమ్ముకున్న పరిసరాలే కనిపించేవి. వంటగది లేక మధ్యాహ్న భోజనం వండేందుకు నిర్వాహకులు నిత్యం ఇబ్బందులు పడేవారు. ప్రహరీ, గేటు లేకపోవడంతో పశువులు లోపలికి వచ్చి యథేచ్ఛగా తిరిగేవి. ఉదయం పాఠశాల ఆవరణలో కనిపించే మందు సీసాలతో, దైన్యంగా, అందవిహీనంగా కనిపించేది. కానీ ‘మన ఊరు-మన బడి’ కింద కొత్త రూపు వచ్చింది. పాఠశాలను పూర్తిగా విద్యుద్ధీకరించారు. కొత్తగా వైరింగ్ చేయించారు. తరగతి గదులతో పాటు, అన్ని గదుల్లోను ఫ్యాన్లు, ట్యూబ్లు బిగించారు. విద్యుద్ధ్దీకరణ కోసం రూ.25,560 వెచ్చించారు. తాగునీటి సౌకర్యానికి ప్రాధాన్యతను ఇచ్చారు. పాఠశాలలో నీటి ట్యాంకును ఏర్పాటు చేశారు. విద్యార్థులకు తాగేందుకు నల్లాలు బిగించారు. బోర్ను వేయించారు. దీనికి గాను రూ.19,498 వ్యయం చేశారు.
ఇక మేజర్, మైనర్ రిపేరింగ్ కేటగిరిలో భాగంగా పాఠశాల తలుపులు, కిటికీలను రిపేర్ చేయించారు. టాయిలెట్స్ల్లో కొత్త బేసిన్లను అమర్చారు. ఫ్లోరింగ్ చేయించారు. మూత్రశాలలు, మరుగుదొడ్లకు రన్నింగ్ వాటర్ సౌకర్యం కల్పించారు. రూ.1,26,052 లక్షలతో మేజర్, మైనర్ రిపేరింగ్ పనులను పూర్తి చేశారు. మధ్యాహ్న భోజనం తయారీ కోసం రూ.4.10 లక్షలతో వంట గదిని నిర్మించారు. ఇక రూ.4.10 లక్షలతో పాఠశాల చుట్టూ ప్రహరీ, గేట్ ఏర్పాటు చేశారు. పాఠశాలకు రంగులు వేయించేందుకు రూ.1.20 లక్షల దాకా వ్యయం చేశారు. మొత్తంగా పెంబట్ల ప్రాథమిక పాఠశాలకు దాదాపు రూ.11 లక్షలు వెచ్చించి సకల సౌకర్యాల విద్యాలయంగా తీర్చిదిద్దారు. నిన్నటి దాకా కళావిహీనంగా కనిపించిన, పాఠశాల నేడు కొత్త శోభతో కనిపిస్తోంది. ఇలా ఈ ఒక్క పాఠశాలే కాదు జిల్లాలో ఎంపికైన 274 స్కూళ్లు మెరుగులు దిద్దుకుంటున్నాయి.
సౌకర్యాలు మెరుగు పడ్డాయి
‘మనఊరు-మనబడి’లో స్కూళ్లకు కొత్త రూపు వస్తోంది. నాడు ఎలాంటి మౌలిక సౌకర్యాలకు నోచుకోని బడులు నేడు కార్పొరేట్కు దీటుగా మారుతున్నాయి. మా స్కూల్లో 450 మంది విద్యార్థులకు రెండేరెండు మూత్రశాలలుండేవి. ఇపుడు 15 నిర్మించారు. ప్రతి తరగతి గదికి విద్యుత్ సౌకర్యంతో పాటు విద్యార్థులు కూర్చునేందుకు టేబుల్స్ ఏర్పాటు చేశారు. సౌకర్యాలన్నీ మెరుగుపడ్డాయి. ఇంకా స్కూల్ ఆవరణలో పది సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. అన్నీ వసతులు సమకూరాయి. విద్యార్థులంతా సంతోషంగా స్కూల్కు వస్తున్నారు.
– పరబ్రహ్మమూర్తి, హెచ్ఎం, కుసుమ రామయ్య పాఠశాల, సిరిసిల్ల
బడి రూపురేఖలు మారాయి..
‘మన ఊరు- మనబడి’తో పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. మా స్కూల్కు ప్రహరి లేక పంచాయతీలకు, మందుబాబులకు అడ్డాగా ఉండేది. సెలవులు వస్తేనే టెన్షన్గా ఉండేది. ప్రభుత్వం రూ.12లక్షలు మంజూరు చేసింది. వాటితో ప్రహరీ నిర్మించారు. గోడలకు మల్టీకలర్స్ పెయింటింగ్ వేశారు. గోడలు, భవనాలపై వేసిన అందమైన బొమ్మలు విద్యార్థులను ఆకట్టుకుంటున్నాయి. విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తున్నది. విద్యార్థులకు భద్రతపై నమ్మకం పెరిగింది. నాణ్యమైన బోధన అందిస్తున్నాం.
– గౌరమ్మ, హెచ్ఎం, ఆర్టీజన్ కాలనీ, పాఠశాల బద్దెనపల్లి
విద్యారంగంలో సమూల మార్పులు..
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యారంగంలో సమూల మార్పులు వచ్చాయి. బడుల బలోపేతానికి ‘మన ఊరు – మనబడి’ చాలా మంచి కార్యక్రమం. అధ్వాన్నంగా ఉన్న పాఠశాలల భవనాలు ఈ రోజు మల్టీకలర్స్లో కార్పొరేట్ను తలదన్నేలా రూపుదిద్దుకుంటున్నాయి. తరగతి గదుల్లో విద్యార్థులకు మంచి సౌకర్యాలు సమకూరుతున్నాయి. అన్ని స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదంటే అది ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సౌకర్యాల వల్లే. మొదటి దశలో 172 పాఠశాలలను ఎంపిక చేసి పనులు చేస్తున్నారు. ఇదే విధంగా జిల్లాలోని అన్ని స్కూళ్లకు కొత్త రూపు తేవాలి. జిల్లా కేంద్రంలో కేజీ టూ పీజీ క్యాంపస్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.
– గన్నమనేని శ్రీనివాసరావు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు
పాఠశాలల దశ మారింది
ప్రభుత్వం సర్కారు విద్యను బలోపేతం చేస్తున్నది. ఈ క్రమంలో పాఠశాలల్లో మరింత మెరుగైన సౌకర్యాలను కల్పించాలని నిర్ణయించింది. మన ఊరు మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ సంకల్పం వందకు వంద శాతం నెరవేరుతుంది. జిల్లాలో మొత్తంగా 549ప్రభుత్వ పాఠశాలలుంటే 191 స్కూళ్లను ఈ కార్యక్రమానికి ఎంపిక చేసి సౌకర్యాలను కల్పిస్తున్నాం. ఇప్పటికే 38స్కూళ్లల్లో పనులు పూర్తయ్యాయి. మన ఊరు మన బడితో సర్కారు బడుల దశ మారిపోతున్నది.
– మాధవి, జిల్లా విద్యాధికారి ,పెద్దపల్లి
మా బడికి కొత్త శోభ..
మాది కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల. ఎక్కడ చూసినా విరిగిన బెంచీలు. ఒరిగిన తలుపులు, కిటికీలు. పగిలిన బండలు. పెచ్చులూడిన స్లాబు, పాకురుపట్టి పగుళ్లు తేలిన గోడలతో అపరిశుభ్రంగా ఉండే మా బడి ప్రస్తుతం ఇలా మారిపోతుందని నేను కలలో కూడా అనుకోలేదు. కార్పొరేట్ బడులను తలపించే విధంగా అందమైన గోడలు, రంగు రంగుల పెయింటింగ్స్, విజ్ఞానాన్ని అందించే బొమ్మలు, కొత్త తలుపులు, కిటికీలు, ఫ్లోరింగ్ చుట్టూ ప్రహరీ, అందమైన తరగతి గదులు, బాలురు, బాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు, మూత్రశాలలు, వెలుగులు పంచే విద్యుత్ సొగబులు, డ్రింకింగ్ వాటర్, కిచెన్ షెడ్, డైనింగ్ హాల్ ఇలా అన్ని రకాల సౌకర్యాలు మా బడి ‘మన ఊరు మన బడి’తో పూర్తిగా మారిపోయింది.
– ఎర్ర రమేశ్, ప్రధానోపాధ్యాయుడు, జడ్పీహెచ్ఎస్ కాల్వశ్రీరాంపూర్