Dava Vasantha | జగిత్యాల, మే 11: ప్రయివేట్ డిగ్రీ కళాశాల విద్యార్థులు, యాజమాన్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదని మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. డిగ్రీ విద్యార్థులు, యాజమాన్యం సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కలెక్టరెట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ బీఎస్ లతను సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వసంత మాట్లాడుతూ శాతావాహన యూనివర్సిటీ పరిధిలో విద్యార్థులు, యాజమాన్యం తీవ్రంగా ఇబ్బందులు ఎదురుకుంటున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్నారు.
కళాశాలకు సంబంధించిన 6వ సెమిస్టరు పరీక్షల నిర్వహణపై తీవ్ర గందరగోళం ఏర్పడిందన్నారు. ఈ నెల 14 నుంచి పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడం, నేటికి హల్ టికెట్లు రాక ఇబ్బందులు ఎదుర్కోవడంతో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నరన్నారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మొండి ప్రవర్తన కారణంగా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందనే ప్రచారం సాగుతుందన్నారు. ఇలాంటి వైఖరి సరికాదని, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకోని పోయి పరిష్కారం కోసం ప్రయత్నం చేయడంలో వైస్ ఛాన్స్ లర్ విఫలం అయ్యారని ఆరోపించారు. ప్రభుత్వం సైతం మొండి వైఖరి విధానం కాకుండా విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని యాజమాన్యంకు పెండింగ్ బిల్లులు చెల్లించడంతో పాటు, విద్యార్థుల పరీక్ష ల నిర్వహణపై పునః పరిశీలన చేయాలని కోరారు.
ప్రభుత్వం, యూనివార్సిటీ అధికారులు తమ పంతం నెగ్గించుకునేందుకు యాజమాన్యం లను బెదిరించడం, విద్యార్థులని ఒత్తిళ్లకు గురి చేయడం సరికాదన్నారు. యాజమాన్యం, విద్యార్థులకు ఎల్లవేళలా అండగా ఉండి, ప్రభుత్వం పై పోరాటానికి సిద్ధంగా ఉంటామని వసంత స్పష్టం చేశారు. విద్యార్థుల సమస్యల పట్ల స్పందించిన దావ వసంత యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ తో ఫోన్ లో మాట్లాడగ, ప్రభుత్వం నిర్ణయం అని దీనికి యూనివర్సిటీ తరుపున చేసేది ఏమి లేదని పేర్కొన్నారని తెలిపారు.
ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేయాలని వసంత విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మహేష్, అర్బన్ మండల అధ్యక్షుడు తుమ్మ గంగాధర్, రాయకల్ మండల అధ్యక్షుడు బర్కం మల్లేష్, కో ఆర్డినేటర్ శ్రీధర్, సీనియర్ నాయకులు వెంకటేశ్వర్ రావు, చింత గంగాధర్, రిజ్వాన్, హరీష్, ప్రణయ్, ప్రతాప్, భగవాన్, సాయి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.