రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ప్రజల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. సమీకృత కలెక్టరేట్లో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ అధ్యక్షతన శనివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరై, మాట్లాడారు. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం, అన్ని శాఖల అధికారులు పని చేయాలని సూచించారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని చెప్పా రు. ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని తెలిపారు. క్షేత్ర స్థాయిలో సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తిగా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాను అభివృద్ధి చేస్తానని ఉద్ఘాటించారు.
మీ ప్రాంత ప్రజా సమస్యల పరిష్కారానికి సర్వసభ్య సమావేశం వేదికగా ఉపయోగించుకోవాలని సభ్యులకు సూచించారు. ముఖ్య సమస్యలు ఏమైనా ఉంటే తక్షణమే పరిష్కరించాలన్నారు. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితిని 10లక్షలకు పెంచి అమలు చేశామన్నారు. ప్రభుత్వ పథకాలు క్షేత్ర స్థాయిలో అమలయ్యేలా చూడాలన్నారు. చైర్పర్సన్ అరుణ మట్లాడుతూ, మండల, గ్రామ స్థాయి లో చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి జడ్పీటీసీలు, ఎంపీపీలకు సమాచారం ఇవ్వాలని అధికారులకు సూచించారు. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం చేయవద్దన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి సర్వసభ్య సమావేశానికి వచ్చిన ఆది శ్రీనివాస్కు పాలకవర్గ సభ్యులు, అధికారులు సన్మానించారు.
సభ దృష్టికి సమస్యలు..
పలువురు ఎంపీపీలు, జడ్పీటీసీలు సభ దృష్టికి పలు సమస్యలు తీసుకువచ్చారు. సిరిసిల్ల ఏరియా దవాఖానలో ఏర్పాటు చేసిన సీటీస్కాన్ వినియోగంలోకి తీసుకురావాలని కోనరావుపేట ఎంపీపీ చంద్రయ్య కోరారు. సిటీస్కాన్ కోసం వైద్యులు రోగులను అంబులెన్స్లో కరీంనగర్కు తరలిస్తున్నారని చెప్పారు. వెంటనే సీటీస్కాన్ను వినియోగంలోకి తేవాలన్నారు. కొన్ని గ్రామాలకు మిషన్ భగీరథ నీరు రావడం లేదని, అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు ఆరోపించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, జడ్పీసీఈవో గౌతంరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, జడ్పీటీసీలు మంజుల, చీటి లక్ష్మణ్రావు, కొమిరిశెట్టి విజయ, గుగులోత్ కళావతి, నాగం కుమార్, మ్యాకల రవి, ఎంపీపీలు జనగామ శరత్రావు, పిల్లి రేణుక, పడిగెల మానస, వంగ కరుణ, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్కు శుభాకాంక్షల వెల్లువ
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరైన ఆయనను సమీకృత కలెక్టరేట్ కార్యాల యంలో అదనపు కలెక్టర్లు ఎన్ ఖీమ్యానాయక్, పూజారి గౌతమి, జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, డీపీఆర్వో మామిండ్ల దశరథం, జిల్లా అధికారులు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.