చెట్ల కింద చదువులు.. విరిగిన కుర్చీలు.. పెచ్చులూడిన పైకప్పులు.. వెలిసిపోయిన గోడలు.. సౌకర్యాల లేమితో కునరిల్లిన సర్కారు బళ్లకు కాలం చెల్లింది. రాష్ట్ర సర్కారు చేపట్టిన ‘మన బస్తీ – మన బడి’తో దశ తిరిగింది. పైలట్ ప్రాజెక్ట్గా ఎంపికైన హుజూరాబాద్లోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల, గణేశ్నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు మహర్దశ వచ్చింది. ప్రహరీకి పెయింటింగ్, అధునాతన డైనింగ్ హాల్, టాయిలెట్స్, జిగేల్మంటున్న విద్యుద్దీపాలు, గ్రీన్ చాక్ బోర్డులు, డిజిటల్ తరగతులు, ఉద్యానవనాన్ని తలపించేలా ప్రాంగణంతో బడి రూపే మారిపోయింది. సకల వసతులతో కార్పొరేట్ లుక్ సంతరించుకోవడంతో విద్యార్థుల నుంచి ఆనందం వ్యక్తమవుతున్నది.
– హుజూరాబాద్టౌన్, ఫిబ్రవరి 4
హుజూరాబాద్టౌన్, ఫిబ్రవరి 4 : ‘మన బస్తీ.. మన బడి’ కింద మొదటి విడుత హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలో తొమ్మిది పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. గణేశ్నగర్ ప్రాథమిక పాఠశాల, బాలుర జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలను ఎంపిక చేయగా, ఆ రెండు పాఠశాలల్లో వంద శాతం పనులు పూర్తయ్యాయి. గత బుధవారం (ఫిబ్రవరి ఒకటో తేదీన) ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. ఈ రెండు స్కూళ్లు ఆధునీకరించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరిగే అవకాశముందని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలను సైతం 23,34,291తో సర్వహంగులతో పునర్నిర్మించారు. గతంలో విద్యార్థులకు విద్యాబోధన చేసేందుకు అవసరమైన చాకు బోర్డులు, తరగతి గదులు, విద్యుద్దీపాలు, డైనింగ్ హాల్ ఇతర సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడేవారు. కానీ, నేడు నూతన మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మించారు. ప్రతి తరగతి గదికి గ్రీన్ చాకుబోర్డులు ఏడు ఏర్పాటు చేశారు. కొత్త డైనింగ్ హాల్ నిర్మించారు. మూడు 75 ఇంచుల టీవీలు విత్ ఇంటర్నెట్ సౌకర్యంతో ఏర్పాటు చేశారు. విద్యార్థులకు చదువుపై ఆసక్తిని పెంచేలా తరగతి గదులు, ప్రహరీని పెయింటింగ్ చేశారు.
గణేశ్నగర్ ప్రాథమిక పాఠశాలను 15లక్షలతో నిధులతో ఆధునీకరించారు. బడి చుట్టూ కాంపౌండ్ నిర్మించడమే గాక నూతనంగా ఓ తరగతి గదిని నిర్మించారు. అన్నింటిలో నూతన విద్యుద్దీకరణ పనులు చేశారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు రన్నింగ్ విత్ వాటర్ స్టోర్ నిర్మించారు. ఆ పాఠశాలలో మేజర్ అండ్ మైనర్ రిపేర్లు 3.5లక్షలతో చేసి గ్రీన్ చాక్ బోర్డులు, గోడలకు కలర్లు వేశారు.
మూత్రశాలలు లేక ఇబ్బంది పడ్డం
ఇంతకుముందు మేం సరైన మూత్ర శాలలు లేక మస్తు ఇబ్బంది పడ్డం. ఇప్పుడు మాకు, సార్లకు వేర్వేరుగా టాయిలెట్ల కట్టిండ్రు. మాకు ఇబ్బందులు తప్పినయ్.
మా బడి రూపురేఖలు మారినయ్..
మా పాఠశాలలో కొన్నేళ్లుగా సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులం చాలా ఇబ్బందులు పడ్డం. కానీ, ‘మన బస్తీ మన బడి’ కింద 23లక్షలతో మా స్కూల్ అధునాతనంగా మారింది. గతంలో వర్షం వస్తే ఉరిసేది. అయినా వాటిలోనే తరగతులు నిర్వహిస్తూ అనేక ఇబ్బందులు పడ్డం. ఇప్పుడు ఆధునీకరించిన్రు. మైనర్, మేజర్ రిపేర్లు చేసిన్రు. డైనింగ్ హాల్, మూత్రశాలలు నిర్మించిన్రు. గ్రీన్ చాక్ బోర్డులు, కొత్త బెంచీలు, లైట్లు, కలరింగ్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. పాఠశాలను బాగు చేయించిన మున్సిపల్ పాలకవర్గానికి, ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటం.
– ఎం సుచిత్ర, ఇన్చార్జి (హెచ్ఎం)ప్రధానోపాధ్యాయురాలు జడ్పీహెచ్ఎస్, హుజూరాబాద్టౌన్
కరెంటు లేక ఇబ్బందుండె
తరగతి గదిలో ఇంతకుముందు కరెంటు లేకుండె. కిటికీ వెలుతురుల చదువుకోవాలంటే ఇబ్బందవుతుండె. మా క్లాస్ రూంలో ఇప్పుడు కరెంటు కనెక్షన్ ఇచ్చి ట్యూబ్ లైట్లు పెట్టిండ్రు. మంచిగ కనిపిస్తుంది. మంచిగ చదువుకోబుద్దయితంది. బోర్డుపై రాసేది క్లియర్గా కనిపిస్తున్నది. టక టకా నోట్స్ రాసుకుంటున్నం.
-చౌహాన్ ప్రియ, తొమ్మిదో తరగతి, జడ్పీహెచ్ఎస్(బాలుర) హుజూరాబాద్టౌన్
డిజిటల్ క్లాసులు చెబుతున్నరు
మాకు డిజిటల్ క్లాసులు చెబుతున్నరు. టీవీలో బొమ్మ చూపెడుతూ, దాని గురించి అర్థమయ్యేలా వివరిస్తున్నరు. నోట్స్ గూడ ఈజీగా రాసుకుంటున్నం. డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేసేందుకు కృషిచేసిన గవర్నమెంట్కు మేమంతా రుణపడి ఉంటం.
-పొనగంటి సాయిచరణ్, 9వ తరగతి, జడ్పీహెచ్ఎస్ (బాలుర) హుజూరాబాద్టౌన్
చెట్ల కింద చదువుకుంటుండె
మాకు ఇంతకుముందు క్లాస్ రూంలు సరిగ లేకుంటే చెట్ల కింద చదువుకునేటోళ్లం. కానీ మన బస్త్తీ మన బడి కింద క్లాస్ రూమ్స్ను రిపేర్ చేసిన్రు. కలర్లు వేసిన్రు. కొత్తవాటిలెక్క మెరుస్తున్నయ్. ఇగ మాకు చెట్ల కింద చదువుకునేడు తప్పింది. సీఎం కేసీఆర్కు మేం జీవితాంతం రుణపడి ఉంటం.
– మీసాల సిద్దు, పదో తరగతి జడ్పీహెచ్ఎస్(బాలుర) హుజూరాబాద్ టౌన్