ధర్మారం, మే16 : స్వరాష్ట్రంలోనే అన్ని వర్గాలకు మేలు చేకూరేలా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ధర్మారం మండలంలో పర్యటించారు. ముందుగా ధర్మారంలో గంగపుత్రుల సంఘం ఆహ్వానం మేరకు గంగాదేవి గుడి వద్దకు రాగా, మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం అధ్యక్షుడు గుమ్ముల పోచయ్య, గౌరవాధ్యక్షుడు గుమ్ముల మల్లయ్య, సంఘ నాయకుడు గుమ్ముల నర్సయ్య అధ్వర్యంలో సుమారు 200 సంఘ సభ్యులు, మహిళలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారితోపాటు బీజేపీ మహిళా మోర్చా మాజీ ప్రధాన కార్యదర్శి పిట్టల స్వరూప, జక్కన్నపల్లికి చెందిన నేతకాని సామాజిక వర్గ యూత్ సభ్యులు పార్టీలో చేరగా మంత్రి వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.
అనంతరం సాయంపేట గ్రామ శివారులో రూ.20.60 లక్షలతో నిర్మించే కాల్వ మాటు నిర్మాణానికి, రూ.31.50 లక్షలతో నిర్మించే కుమ్మరోళ్ల మాటు నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ధర్మారంలోని గంగపుత్ర కాలనీలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బాస తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి ప్రసంగిస్తూ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపల పెంపకం వృత్తిపై ఆధారపడి జీవించే గంగపుత్రులు (బెస్త), ముదిరాజ్ కుటుంబాల గురించి అధ్యయనం చేసిన తర్వాత వారి ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. మొట్ట మొదట రైతులకు, మత్స్యకారులకు, రజకులకు మేలు జరిగేలా మిషన్ కాకతీయ పథకం కింద రూ.కోట్లాది నిధులు ఖర్చుచేసి 46,000 చెరువులను పునరుద్ధరణ చేయటంతో జలాశయాల్లో నీటి సమృద్ధి పెరిగిందని వివరించారు.
గతంలో చేపలు ఆంధ్రా ప్రాంతం నుంచి దిగుమతి అయ్యే దీన పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. కాగా, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఉచితంగా చేప విత్తనాలు పంపిణీ చేయడంతో పెద్ద ఎత్తున మత్స్య సంపద పెరిగి, రాష్ట్రం ఫిష్ హబ్గా మారిందని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్కు అనుబంధంగా నిర్మించిన నంది రిజర్వాయర్లో ఒకే రోజు 20 టన్నుల చేపలు అక్కడి మత్స్యకారులు పట్టి విక్రయించారని గుర్తు చేశారు. ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్లినా అన్ని రకాల చేపలు లభ్యమవుతున్నాయంటే అది సీఎం కేసీఆర్ చేసిన పక్కా ప్రణాళిక వల్లేనని చెప్పారు. మత్స్యకారులకు ఉచితంగా మోపెడ్లు, వలలు, తెప్పలు ప్రభుత్వం అందించిందని వివరించారు.
గంగపుత్రులకు అన్ని విధాలుగా అండ
ధర్మారం మండల కేంద్రంలోని గంగ పుత్రులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి ఈశ్వర్ అభయమిచ్చారు. మండల కేంద్రంలో గంగపుత్రుల కోరిక మేరకు ఫిష్ మార్కెట్ ఏర్పాటు కోసం రూ.50 లక్షల నిధులు మంజూరు చేశామని గుర్తు చేశారు. టెండర్ల ప్రక్రియ పూర్తి కాగానే మార్కెట్ నిర్మాణం మొదలు పెడతామని తెలిపారు. కాగా, గంగపుత్రుల వినతి మేరకు గంగాదేవి గుడి చుట్టూ ప్రహరీ, బీసీ కాలనీ నుంచి గంగాదేవి గుడి వరకు సీసీ రోడ్డు, కమ్యూనిటీ భవనం నిర్మాణం, ఎర్రగుంటపల్లి శివారులోని ఎస్సారెస్పీ డీ 83/బీ కాల్వ నుంచి ఊరకుంట వరకు, ఊరకుంట నుంచి శీతల చెరువు వరకు పంట కాల్వను పునరుద్దరించి సీసీ లైనింగ్ చేయించడానికి నిధులు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అండగా ఉంటామని మంత్రికి గంగపుత్రులు స్పష్టం చేశారు.
అనంతరం దాసరి కాలనీలో పర్యటించగా హోలియా దాసరి కులస్తులు పలు సమస్యలను మంత్రికి విన్నవించారు. నిరుపేదలకు ‘గృహ లక్ష్మి’ పథకం ద్వారా ఇండ్లు కట్టిస్తామని భరోసా ఇచ్చారు. ఇది వరకు సిద్దిపేట జిల్లాలో ఉన్న సమయంలో దాసరి సామాజికవర్గం వారికి ఎస్సీ కులం సిర్టిఫికెట్ ఇచ్చే వారిని, ఇక్కడ బీసీ కులం సర్టిఫికెట్ ఇస్తున్నారని తెలుపగా, ఎస్సీ కుల సర్టిఫికెట్ ఇచ్చేలా చూడాలని కలెక్టర్ సంగీత సత్యనారాయణతో ఫోన్లో మాట్లాడారు. స్థలం ఉంటే కమ్యూనిటీ భవనానికి నిధులు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
అభివృద్ధిలో సాయంపేట భేష్
ధర్మారం మండలం సాయంపేట గ్రామం స్వరాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చెందిందని ఆ సర్పంచ్ చెనెల్లి సాయి కుమార్ను మంత్రి అభినందించారు. సర్పంచ్ గ్రామ అభివృద్ధి గురించి తన దృష్టికి తీసుకు రావడం వల్ల నిధులు కేటాయించడంతో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. గతంలో ఈ గ్రామం ఎంతో అధ్వాన్నంగా ఉండేదని, నేడు ఎంతో అభివృద్ధి చెందిందని ప్రశంసించారు. ప్రస్తుతం రూ.65 లక్షల వ్యయంతో మన ఊరు- మన బడి కార్యక్రమం కింద కొత్తగా పాఠశాల భవన నిర్మాణం జరుగుతుందని, ఇంకా గ్రామంలో మిగిలిన పాత రహదారి అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని, ఫంక్షన్ హాలు కట్టిస్తామని హామీ ఇచ్చారు.
ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ కరుణశ్రీ బలరాంరెడ్డి, జగిత్యాల జడ్పీ వైఎస్ చైర్మన్ హరిచరణ్రావు, ప్యాక్స్ చైర్మన్ మత్యాల బలరాం రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, సాయంపేట సర్పంచ్ చెనెల్లి సాయికుమార్, ఎంపీటీసీ జనగామ లక్ష్మి-రాజయ్య, ధర్మారం, సాయంపేట ఉప సర్పంచులు బద్దం శ్యామల, ఆవుల లత, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీ, ఆర్బీఎస్ జిల్లా సభ్యులు రామారావు, ఎగ్గెల స్వామి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్, పార్టీ మండల అధికార ప్రతినిధి గుర్రం మోహన్రెడ్డి, ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం డైరెక్టర్ జైన రాజమౌళి, ధర్మారం, సాయంపేట గ్రామ శాఖ బీఆర్ఎస్ అధ్యక్షుడు బాస తిరుపతిరావు, బొలిశెట్టి సుధాకర్, నీటి పారుదల శాఖ డీఈఈ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.