ఆయిల్పామ్ మన వద్ద పండదంటూ సమైక్య రాష్ట్రంలో వ్యవసాయాన్ని తప్పుదోవ పట్టించారు. దీంతో తెలంగాణ ప్రాంతం అన్యాయానికి గురైంది. కానీ, సీఎం కేసీఆర్ తెలంగాణలో ఆయిల్పామ్ సాగుపై సర్వే చేయించారు. ఇక్కడ అనుకూలమైన వాతావరణం ఉన్నది. పంట అద్భుతంగా పండుతుందనే నివేదిక వచ్చింది.వరితో పోలిస్తే ఆయిల్పామ్ సాగులో 60 నుంచి 70లాభం వస్తుంది. అటవీ జంతువులు, కోతులు, పక్షుల బెడద ఉండదు. నాలుగేళ్ల వరకు అంతర పంటలు వేసుకోవచ్చు. ప్రభుత్వం మొక్కలు, డ్రిప్కు రాయితీ ఇస్తున్నది. రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు, సూచనలు అధికారులతోపాటు లోహియా కంపెనీ ప్రతినిధులు అందిస్తున్నారు. రైతులు పండించిన పంటను లోహియా కంపెనీ కొనుగోలు చేసి అదే రోజు డబ్బులు చెల్లిస్తుంది.
– ఆయిల్ పామ్ సాగుపై రైతుల అవగాహన సదస్సులో మంత్రి గంగుల కమలాకర్
ముకరంపుర, జనవరి 4: ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్పామ్కు మంచి డిమాండ్ ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ, లోహియా ఎడిబుల్ ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో ఆయిల్పామ్ తోటల సాగుపై బుధవారం రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఏటా దేశంలో సుమారు 95వేల కోట్ల విలువైన నూనె విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని వివరించారు.
ఈ పరిస్థితుల్లో మన దగ్గరే ఆయిల్పామ్ పంట పండించి, ఉత్పత్తి చేయాలని నిర్ణయించారని వివరించారు. దిగుమతి చేసుకునే పరిస్థితి నుంచి సొంతంగా ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకోవాలని కోరారు. ఆయిల్పామ్తో కేవలం నూనె మాత్రమే కాకుండా అనేక రకాలైన ఉప ఉత్పత్తుల తయారీలో వినియోగిస్తారని వివరించారు. కరీంనగర్ జిల్లాలో 45 ఎకరాలు సాగవుతున్నదని, తనతో పాటు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కూడా సాగు చేస్తున్నట్టు చెప్పారు. కొత్తగా వచ్చిన లామే రకం మొక్కలను కూడా నాటిస్తానని తెలిపారు. తన సొంతూరైన వెల్గటూరులోనూ 50ఎకరాల్లో ఆయిల్పామ్ వేస్తామని చెప్పారు.
అంతకు ముందు లోహియా, నెటాఫిమ్ కంపెనీ ప్రతినిధులు ఆయిల్పామ్ మొక్కల ఎంపిక, నాటే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎరువుల యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ చర్యలు, పంట కొనుగోళ్లు, ధర, నీటి తడులు, కరీంనగర్ జిల్లాలో పంపిణీ చేస్తున్న ఆయిల్ పామ్ మొక్కల రకాల గురించి రైతులకు వివరించడంతో పాటు ఇతర అంశాలపై రైతుల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, జిల్లా వ్యవసాయ అధికారి వీ శ్రీధర్, ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి బండారి శ్రీనివాస్, వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
నాకు మొత్తం 11ఎకరాల భూమి ఉంది. బోరు, బాయినీరే ఆధారం. ఇప్పటి దాకా మొత్తం వరి సాగు చేసిన. ఆయిల్పామ్ సాగుకు భవిష్యత్తు మంచిగుందని ఉద్యాన, వ్యవసాయ శాఖ అధికారులు చెప్పడంతో నాలుగెకరాల్లో మొక్కలు నాటేందుకు డీడీలు కట్టిన. ఉద్యాన శాఖ అధికారులు ఖమ్మం జిల్లాకు తీసుకుపోయి అక్కడి ఆయిల్పామ్ తోటలు చూపించిండ్రు. అక్కడి రైతులతో మాట్లాడితే లాభసాటిగానే ఉంటదని చెప్పడంతో సాగుకు ముందుకు వచ్చినం.
– నరహరి గణేశ్ రెడ్డి, పచ్చునూరు (మానకొండూర్)
ఆయిల్పామ్ సాగుకు మంచి భవిష్యత్తు ఉంది. ఈ సంవత్సరం జిల్లాలో 10వేల ఎకరాల్లో సాగు లక్ష్యం. ప్రభుత్వం రాయితీపై మొక్కలు, డ్రిప్ అందిస్తుంది. నాలుగేళ్లలో దిగుబడి వస్తుండడంతో తోటల నిర్వహణ, అంతర పంటల సాగుకోసం రైతులకు ప్రోత్సాహం అందిస్తున్నది. ఎస్సారెస్పీ, ఎల్ఎండీ, కాళేశ్వరం జలాలతో జిల్లాలో సాగునీటి లభ్యత బాగుంది. మే నెలలో కూడా 90శాతం చెరువులు, కుంటలు నింపే అవకాశం ఉంది. వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్పామ్ సాగుపై దృష్టి కేంద్రీకరిస్తున్నాం. జగిత్యాల జిల్లాలో లోహియా కంపెనీ ఇండస్ట్రీ ప్రారంభిస్తున్నది.
– ఆర్వీ కర్ణన్, కరీంనగర్ కలెక్టర్
హైదరాబాద్కు ప్రతి రోజూ వందలాది టన్నుల మాంసం, చేపలు దిగుమతి చేసుకునే స్థితి నుంచి ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నాం. సీఎం కేసీఆర్ కృషి ఫలితంగానే ఇదంతా సాధ్యమైంది. స్వయంగా నేనే ఆయిల్పామ్ మొక్కలను నాటా. తోట చాలా బాగుంది. ఆయిల్పామ్కు డిమాండ్ అధికంగా ఉంది. నియోజకవర్గంలోనూ వందలాది ఎకరాల్లో వేయిస్తాం. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది.
– సుంకె రవిశంకర్, చొప్పదండి ఎమ్మెల్యే
ఆయిల్పామ్ సాగులో కరీంనగర్ను తెలంగాణలో నంబర్ వన్ స్థానంలో నిలుపాలి. చిగురుమామిడి మండలంలోనే ఆయిల్పామ్ నర్సరీని ఏర్పాటు చేశారు. మంత్రి గంగుల కమలాకర్తో మొలకలు నాటి పలు సార్లు పరిశీలించాం. మా స్వగ్రామం సింగపూర్లో 15ఎకరాల్లో మొక్కలు నాటిస్తా. తెలంగాణాలో కొత్తగా సాగు చేస్తున్నందున రైతులు నమ్మకంతో ముందడుగు వేయాలి. లాభసాటిగానే ఉంటుంది.
– వొడితల సతీశ్కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే