కమాన్చౌరస్తా, ఏప్రిల్ 12: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో డ్రై ఫ్రూట్స్కు మంచి డిమాండ్ పెరిగింది. అంతే కాకుండా రంజాన్ మాసంలో ప్రతి రోజూ ప్రత్యేక ప్రార్థన, ఉపవాస దీక్షతో ముస్లింలు ముక్తి మార్గంలో నడిచేందుకు వారు తీసుకునే ఆహారంలో అదనపు శక్తినిచ్చే డ్రై ఫ్రూట్స్ ఎంతో ఉపయోగపడుతాయి. ఉపవాసం పాటించే వారికి డ్రైఫ్రూట్స్, పండ్లు, ఫలహారం తగిన శక్తిని అందిస్తాయి. ప్రత్యేకంగా రంజాన్ మాసంలో ఉపవాసంతో రోజువారీ పనులతో నీరస పడిపోకుండా సహార్, ఇఫ్తార్లో ఖర్జూర పండ్లతోపాటు బాదం, కాజు (జీడిపప్పు), అక్రోట్, కిస్మిస్, ఎండు ఖర్జూర, చెర్రీస్, అంజీర, పిస్తా, ఎండు ఆప్రికాట్ (ఖుర్బానీ) వంటి డ్రైఫ్రూట్స్, ఆపిల్, అరటి, బత్తాయి, సపోట, పుచ్చకాయ, ఫైనాపిల్, దానిమ్మ వంటి పండ్లను ఆహారంగా స్వీకరిస్తారు.
ఉపవాస దీక్ష సమయంలో ఆహార నియమాలు కూడా పాటిస్తే ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉంటారు. సహార్కు ముందు, ఇఫ్తార్ తర్వాత తీసుకునే ఆహారంలో మంచి పోషక విలువలు ఉండేలా చూసుకోవాలి. తెల్లవారుజామున తీసుకునే ఆహారంలో వరి, గోధుమ, జొన్న వంటి పిండి పదార్థాలు తీసుకోవాలి. బత్తాయి రసం తాగితే శరీరానికి పొటాషియం, సోడియం, మినరల్స్ లభిస్తాయి. ఇఫ్తార్ సమయంలో ఖర్జూర, కొన్ని రకాల పండ్లు తక్కువ మొత్తంలో తీసుకుని రాత్రి 8 గంటల సమయంలో భోజనం చేయాలి. బియ్యం, గోధుమలు, రాగులతో తయారు చేసిన ఆహారం తీసుకోవాలి. హలీమ్, హరీస్ లాంటివి తీసుకుంటే ఉదయం నుంచి కోల్పోయిన శక్తిని తిరిగి పొందవచ్చు. రాత్రి 10 తర్వాత పండ్లు తీసుకోవాలి.
డ్రైఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఫలాలు. వీటిలో పోషకాలు మెండుగా ఉంటాయి. రంజాన్ రోజుల్లోనేగాక మిగతా రోజుల్లోనూ బాదం, కాజు (జీడిపప్పు), అక్రోట్, కిస్మిస్, ఎండు ఖర్జూర, చెర్రీస్, అంజీర, పిస్తా, ఎండు ఆప్రికాట్ (ఖుర్బానీ) వంటి డ్రైఫ్రూట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ప్రొటీన్స్, మినరల్స్, విటమిన్లు, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు వీటిలో అధికంగా లభిస్తాయి.
ఎండు ఫలాలు కొనే ముందు నాణ్యత పరిశీలించుకోవాలి. ఇవి రెండు మూడు రకాల క్వాలిటీల్లో ఉంటాయి. అందులో నాణ్యమైనవి.. తాజావి తీసుకోవాలి.
ఇండ్లల్లో ప్లాస్టిక్ లేదా గాజు సీసాల్లో తడి లేకుండా చేసి నిల్వ ఉంచుకోవాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉంచరాదు. ఎప్పటికప్పుడు తాజావి కొనుక్కోవడం ఉత్తమం.
రుచిగా.. పోషక విలువలు ఉన్నాయని డ్రై ఫ్రూట్స్ అధికంగా తింటే అజీర్ణం, అనారోగ్య సమస్యలు వస్తాయి. రోజుకు రెండు నుంచి నాలుగు డ్రైఫ్రూట్స్ మాత్రమే తీసుకోవడం ఉత్తమం. తినే ముందు శుభ్రపరచడం మరువవద్దు.
రంజాన్ సందర్భంగా ఖర్జూర, డ్రైఫ్రూట్స్, పండ్ల ధరలు పెరిగాయి. గతంలో సాధారణ ఖర్జూర కిలో రూ.80-120 మధ్య ఉండగా ఈసారి కిలో రూ.120-1100 వరకు పలుకుతోంది. బాదం కిలో రూ. 700-2000, కాజు (జీడిపప్పు)కిలో రూ.760-1200, అక్రోట్ కిలో రూ. 300-600, కిస్మిస్ కిలో రూ.200, ఎండు ఖర్జూర రూ.220-360, చెర్రీస్ కిలో రూ.80, అంజీర కిలో రూ. 1000-1200, పిస్తా కిలో రూ. 1000-2000, ఎండు ఆప్రికాట్ (ఖుర్బానీ), వివిధ రకాల ఖర్జూర కిలో రూ.80-2000 వరకు రకాన్ని బట్టి ధరలు ఉన్నాయి.
రంజాన్ నెలలో ఖర్జూర పండ్లను ఎక్కువగా తీసుకుంటారు. ఉపవాస దీక్ష విరమణ (ఇఫ్తార్) సమయంలో ఖర్జూర పండ్లతోనే దీక్ష విరమణ చేస్తారు. అందుకే ఖర్జూర ‘ఇఫ్తార్ కా ఫల్’ గా ప్రసిద్ధి కెక్కింది.
డ్రై ఫ్రూట్స్ కేవలం రంజాన్ మాసంలోనే ఎక్కువ అమ్మకాలు జరుగుతాయి. ఖర్జూరకు దీక్షల సమయంలోనే ఆదరణ ఎక్కువగా ఉంటుంది. సాధారణ సమయాల్లో కంటే 60 శాతం ఎక్కువ మార్కెట్ ఉంటుంది. ఆరు సంవత్సరాలుగా ఇదే వ్యాపారంలో ఉన్నా. ఉపవాస దీక్షలో ఉన్నవారు డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే అధిక శక్తి వస్తుంది.
– మహ్మద్ మజ్హర్, వ్యాపారి
రంజాన్ మాసంలో ఎక్కువగా అమ్మకాలు జరిగే డ్రైఫ్రూట్ను ప్రత్యేకంగా ఇక్కడికి తెప్పిస్తాం. ఇందుకోసం సౌదీ, అరబ్ దేశాల నుంచి హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఇక్కడికి తెప్పిస్తుంటాం. రంజాన్ మాసంలో వీటి అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మధ్య కాలంలో డ్రై ఫ్రూట్స్ అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
– మహ్మద్ వషీదుద్దీన్, వ్యాపారి