GODHAVARIKHAN| ఫర్టిలైజర్ సిటీ, ఏప్రిల్ 17: ఉలుకు పలుకు లేకుండా అపస్మారక స్థితిలో ఉన్న ఆరు రోజుల పసికందు తో మహారాష్ట్రకు చెందిన దంపతులు గోదావరిఖనిలోని ప్రభుత్వ దవాఖానాకు వచ్చిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆ పసికందును జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి దత్తత ఇస్తున్న క్రమంలో శిశువు అనారోగ్యంతో ఉన్నట్లు గుర్తించి మార్గమధ్యంలో గోదావరిఖని ప్రభుత్వ దవాఖానకు వచ్చారు. దీంతో మొదట ఆసుపత్రి వర్గాలు కలవరపడ్డాయి.
వెంటనే అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది గోదావరిఖని వన్ టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ ఇంద్రసేనారెడ్డి రంగంలోకి దిగి ఆ పసికంచను తీసుకోవచ్చిన దంపతులను విచారించగా, ఆ శిశువును మరో వ్యక్తికి దత్తత ఇచ్చినట్లు నిర్ధారణైనట్లు తెలిసింది. స్థానికుల కథనం ప్రకారం.. మహారాష్ట్ర లోని బల్లార్షా కు చెందిన రవీంద్ర – దుర్గం అనే భార్య భర్తలు కూలి నాలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వారికి ఇదివరకే ముగ్గురు సంతానం కలిగి ఉన్నారు. నాలుగో సంతానం కలిగితే ఎవరికైనా దత్తత ఇద్దామని నిశ్చయించుకున్నారు.
ఈ నేపథ్యంలోనే భూపాలపల్లి జిల్లా కాటారంనకు చెందిన చాంద్ పాషా అనే వ్యక్తి పెంచుకోవడానికి ఒక బిడ్డ కావాలని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మ్యారేజ్ బ్యూరో నడుపుతున్న మహిళను ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే బల్లర్షకు చెందిన సదరు దంపతుల వద్ద ఆరు రోజుల పసికందు ఉన్నట్లు తెలుసుకొని వారిని సంప్రదించారు. ఆ నవజాత శిశువును దత్తత ఇచ్చేందుకు అంగీకరించి మంచిర్యాలకు చేరుకున్నారు. అప్పటికే కాటారంనకు చెందిన చాంద్ పాషా మంచిర్యాలకు వచ్చి ఉండడంతో ఆ పసికందును తీసుకువెళ్లడానికి సిద్ధమయ్యాడు.
ఇంతలో ఆ శిశువు ఉలుకు పలుకు లేకుండా ఉండడంతో అనుమానం వచ్చి మార్గమధ్యంలో గోదావరిఖనిలోని ప్రభుత్వ దవాఖానకు తీసుకువచ్చారు. ఆసుపత్రి వర్గాలకు పొంతన లేని వివరాలు చెబుతుండడంతో అనుమానం వచ్చిపోలీసులకు సమాచారమందించారు. ఆ పసికందును ఎక్కడి నుంచి అయినా తీసుకు వస్తున్నారా..? లేక దత్తత తీసుకున్నారా? విక్రయించారా ? అన్న కోణంలో సమగ్ర బాలల సంరక్షణ అధికారి సమక్షంలో వన్ టౌన్ పోలీసులు విచారణ చేయగా, ఆ దంపతులు తామే దత్తత ఇచ్చామని అంగీకరించారు. అయితే పసికందు అనారోగ్యంగా ఉండడంతో జిల్లా సంరక్షణ అధికారి సమక్షంలో దవాఖానలో ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. శిశువు పూర్తిగా కోలుకున్నాక తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి అప్పగిస్తామని అధికారులు తెలిపారు.