కనీస సౌకర్యాలు లేక కొట్టుమిట్టాడిన జీడీ నగర్ సర్కారు పాఠశాల దశ తిరిగింది. ‘మన ఊరు.. మన బడి’తో తన స్వరూపాన్నే మార్చుకున్నది. విభిన్న రంగులతో కళకళలాడుతున్నది. అధునాతన టాయిలెట్స్, విశాలమైన వంట గది, తరగతి గదిలో డ్యూయల్ డెస్క్లు, గ్రీన్ బోర్డులు, విశాలమైన ప్లే గ్రౌండ్, హ్యాండ్ వాష్ కోసం నల్లాలు ఏర్పాటు చేసుకొని కార్పొరేట్ స్కూల్కు దీటుగా తయారైంది.
పాలకుర్తి, ఫిబ్రవరి 12 : ఒకప్పుడు జెండా బడిలా పిలుచుకునే జీడీనగర్ ప్రాథమిక పాఠశాల పశువుల కొట్టంలా, పందులు, కుక్కలకు ఆవాసంగా ఉండేది. ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో భాగంగా పాలకుర్తి మండలంలోని జీడీ నగర్ ప్రభుత్వ పాఠశాలలో 16.50 లక్షలతో విద్యార్థులకు పూర్తిస్థాయిలో అధునాతన సౌకర్యాలు కల్పించారు. పాఠశాల ప్రహరీ ఎత్తు పెంచారు. ప్రతి తరగతి గదిలో గ్రీన్బోర్డులు, డ్యూయల్ డెస్క్లు ఏర్పాటు చేశారు. బాలబాలికలకు ప్రత్యేక వాష్రూంలు ఏర్పాటు చేశారు. కిచెన్రూం, చేతులు కడుక్కునేందుకు నల్లాలు, ప్లేగ్రౌండ్ ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ సూర సమ్మయ్య ప్రత్యేక చొరవతో ‘మన ఊరు – మన బడి’ ద్వారా వచ్చిన 13 లక్షలకు తోడుగా, గ్రామపంచాయతీ జనరల్ ఫండ్ నుంచి మరో 3 లక్షలు కేటాయించి, మొత్తం 16.50 లక్షలతో పూర్తిసౌకర్యాలు కల్పించారు. ఇటీవల జడ్పీచైర్మన్ పుట్టమధు, కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ పాఠశాలను ప్రారంభించారు.
ఒకప్పుడు జెండా బడిలా పిలుచుకునే జీడీనగర్ ప్రాథమిక పాఠశాల పశువుల కొట్టంలా, పందులు, కుక్కలకు ఆవాసంగా ఉండేది. మన ఊరు.. మనబడిలో జీడీనగర్ పాఠశాలను ఎంపికచేయడం సంతోషంగా ఉంది. ఇప్పుడు పాఠశాల రూపురేఖలు పూర్తిగా మారినయ్. కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా విద్యార్థులకు సౌకర్యాలు ఉన్నయ్..
– సూరసమ్మయ్య, సర్పంచ్
ఊహించని విధంగా పాఠశాలలో వసతులు మెరుగయ్యాయి. గతంలో పాఠశాలకు కనీసం నల్లా ఏర్పాటు చేయాలన్నా ఇబ్బంది ఉండేది. అలాంటి మన ఊరు మనబడి పథకం పాఠశాల రూపురేఖలను పూర్తిగా మార్చివేసింది. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. పేద విద్యార్థులు ఎక్కువగా చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి అధునాతన వసతులు కల్పించినందుకు చాలా సంతోషంగా ఉన్నది.
– ఏ రవీంద్రకుమార్, ప్రధానోపాధ్యాయుడు