సంక్షేమ సంబురం అంబరాన్నంటింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో అట్టహాసంగా సాగింది. ఉదయం నుంచే అన్ని మండలాల నుంచి ప్రజానీకం భారీగా తరలివచ్చి సంక్షేమ సారథి సీఎం కేసీఆర్కు సలాం కొట్టింది. ఇంటింటా సంక్షేమంతో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపింది. తమను ఇంతలా ఆదుకుంటున్న ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటామని స్పష్టం చేసింది. రెండో విడుత గొర్రెల యూనిట్లు అందుకున్న గొల్ల కుర్మలు, రూ.లక్ష ఆర్థిక సాయం అందుకున్న కులవృత్తిదారులు, ఇండ్ల పట్టాలు అందుకున్న నిరుపేదల్లో సంతోషం కనిపించింది. కాగా, కరీంనగర్లోని రేకుర్తిలో జరిగిన సంబురాల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్రావు, చొప్పదండిలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యే రవిశంకర్, మానకొండూర్లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జడ్పీ సీఈవో ప్రియాంక, హుజూరాబాద్లో మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ విజయ, కలెక్టర్ కర్ణన్ పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న జిల్లాల వికేంద్రీకరణ నిర్ణయంతో ప్రజల చెంతకు పాలన చేరువైంది. కొత్త జిల్లాలు ఏర్పడ్డ తర్వాత ఏడేండ్లలోనే ఎంతో అభివృద్ధి కనిపిస్తున్నది. చిన్న జిల్లా కావడంతో పరిధి తగ్గి కలెక్టర్, సీపీ, ఎస్పీ స్థాయి సహా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులంతా గ్రామాల్లో కలియదిరుగుతుండగా, మెజార్టీ ప్రజా సమస్యలకు త్వరితగతిన పరిష్కారం దొరుకుతున్నది. ఇదే సమయంలో ప్రతి శాఖపైనా నిఘా పెరిగి, సంక్షేమ పథకాలు పక్కాగా అమలు కావడంతోపాటు ప్రగతి పనుల్లో పారదర్శకత కనిపిస్తున్నది. సాధారణ ప్రజానీకం జిల్లా కేంద్రంలోని కార్యాలయాలకు వెళ్లడమనేది నల్లేరుపై నడకలా మారిపోయింది. అధికారుల పర్యవేక్షణ పెరుగగా, సిబ్బందికి జవాబుదారీతనం అబ్బింది. వెరసి మార్పు ఆరంభమైంది.
కరీంనగర్, జూన్ 8(నమస్తే తెలంగాణ): తెలంగాణ దశాబ్ధి ఉత్సావాలలో భాగంగా శుక్రవారం సంక్షేమ సంబురాలు అట్టహాసంగా జరిగాయి. నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన ఈ వేడుకలకు ఆసరా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, డబుల్బెడ్రూం లబ్ధిదారులతో పాటు గొల్లకుర్మలు, కులవృత్తిదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకం అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ను వేనోళ్ల పొగిడారు. బీఆర్ఎస్ సర్కారుకు రుణపడి ఉంటామని స్పస్టం చేశారు. కాగా, కరీంనగర్లోని రేకుర్తిలో గల శుభం గార్డెన్లో జరిగిన సంబురాల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, నగర మేయర్ వై సునీల్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పలువురు కులవృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందజేసి ప్రారంభించారు. పలువురికి కల్యాణలక్ష్మి, షాదీముబరాక్ చెక్కులను అందించారు. వీటితోపాటు బద్దిపల్లి, కొత్తపల్లి మండలంలోని పలువురికి భూమి పట్టాలను అందించారు.
పలువురు గొల్ల కుర్మలకు గొర్రెల యూనిట్లను అందించారు. గంగాధర మండలం మధురానగర్లోని వీఏఎస్ ఫంక్షన్ హాల్లో జరిగిన చొప్పదండి నియోజకవర్గస్థాయి సంబురాల్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హాజరయ్యారు. అంతకు ముందు డప్పు చప్పుళ్లు, ఒగ్గు డోలు విన్యాసాలు, బతుకమ్మలు, బోనాలతో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఫంక్షన్ హాలు వరకు బీఆర్ఎస్ నాయకులు, మహిళలు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు ర్యాలీ తీశారు. అనంతరం వినోద్కుమార్, ఎమ్మెల్యేను నాయకులు గజమాలతో సన్మానించారు. మల్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి వినోద్కుమార్కు నాగలిని బహూకరించారు. అనంతరం కులవృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయం, గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. మానకొండూర్ మండలం ముంజంపల్లి శివారులోని కేఎస్ఆర్ ఫంక్షన్ హాలులో జరిగిన సంబురాల్లో రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్, జడ్పీ సీఈవో ప్రియాంక పాల్గొన్నారు.
ముందుగా రెండో విడుత గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి, మానకొండూర్ మండలం రంగపేటకు చెందిన మారం దేవయ్య, కాల్వ ఎల్లయ్య, రాపెల్లి మల్లేశ్కు మూడు యూనిట్లు అందజేశారు. అనంతరం యాదవ కులస్తులు ఎమ్మెల్యేను గొంగలితో సన్మానించి గొర్రె పిల్లను బహూకరించారు. హుజూరాబాద్ వ్యవసాయ మార్కెట్లో జరిగిన సంబురాల్లో మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పాల్గొన్నారు. ముందుగా వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి జ్యోతి ప్రజ్వలన చేసి సంబురాలను ప్రారంభించారు. అనంతరం వివిధ సంక్షేమ పథకాల ద్వారా మంజూరైన లబ్ధిదారులకు చెకులను అందజేశారు. అంతకుముందు సాంస్కృతిక సారథి కళాకారుల ఆటపాటలు, కళా ప్రదర్శనలు సభికులను ఆకట్టుకున్నాయి.