కార్పొరేషన్, అక్టోబర్ 17: కరీంనగర్ నుంచి మళ్లీ గెలిపిస్తే నగరాన్ని అన్నింటా ఆదర్శంగా నిలిపి మీ రుణం తీర్చుకుంటానని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. ఇప్పటికే కేబుల్ బ్రిడ్జిని అందుబాటులోకి తెచ్చామని, ఏడాదిలోగా మానేరు రివర్ ఫ్రంట్ను పూర్తిచేసి పర్యాటకంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. ఈ నెల 18న బుధవారం రాంనగర్ గ్రౌండ్లో నిర్వహించనున్న కేటీఆర్ ఆశీర్వాద సభకు ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక మీ సేవా ఆఫీసులో విలేకరులతో మాట్లాడారు.
కరీంనగర్ అనేక చారిత్రక ఘట్టాలకు వేదికగా నిలిచిందని చెప్పారు. కేసీఆర్ ఇక్కడి నుంచే సింహగర్జన సభ నిర్వహించి ప్రత్యేక ఉద్యమ సమరశంఖం పూరించారన్నారు. బృహత్తరమైన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని గుర్తు చేశారు. ఆది నుంచి కేసీఆర్కు కరీంనగర్పై ఎనలేని ప్రేమ ఉన్నదన్నారు. ఈ ప్రాంత ప్రజలు సైతం ఆయనకు అడుగడుగునా అండగా నిలిచారన్నారు. ఎన్నిక ఏదైనా గులాబీ జెండాను రెపరెపలాడించారని చెప్పారు. ఈ గడ్డనుంచి తనను మూడుసార్లు గెలిపించి చరిత్రను తిరగరాశారని పేర్కొన్నారు. పదేండ్లలో పెద్దమొత్తంలో నిధులు తెచ్చి నగరాన్ని గొప్పగా తీర్చిదిద్దానని చెప్పారు. అన్ని డివిజన్లలో మట్టిరోడ్లు లేకుండా కృషి చేస్తున్నానన్నారు. అలాగే కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్, ఐటీ టవర్, టీటీడీ ఆలయం, ఇస్కాన్ టెంపుల్, ప్రభుత్వ వైద్యశాలను తెచ్చామన్నారు. ఇప్పుడు నగరంలో కొనసాగుతున్న ప్రతిపనిని చిత్తశుద్ధితో పూర్తిచేస్తానని తెలిపారు.
ఈ ప్రగతి కొనసాగాలంటే కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎంగా గెలిపించాలన్నారు. ప్రజలు విలువైన ఓటును ఒడిపోయేవారికి వేసి వృథా చేసుకోవద్దన్నారు. స్వార్థపరులను ఆదరించవద్దని, పనిచేసేవారికే పట్టంగట్టాలని కోరారు. తాను అందుబాటులో ఉండి అభివృద్ధి చేశానని, ఇదంతా మీ కండ్ల ముందరే కనిపిస్తున్నదని చెప్పారు. వినూత్న సంక్షేమ పథకాలు తెచ్చి పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న కేసీఆర్ దైవసమానులని కొనియాడారు. ఆయన ఓ నాయకుడు కాదని..ప్రజల ఆస్తి అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చలవతో పార్టీలో ఉన్నన్నీ పదవులు అనుభవించిన ఈటల రాజేందర్.. ఇప్పుడు ఆయనపై అనుచిత ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు.
ఆయన మంత్రిగా ఉన్నప్పుడే హుజూరాబాద్ వేదికగా రైతుబంధు స్కీంను తెచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే మరో విప్లవాత్మకమైన పథకమైన దళితబంధును హుజూరాబాద్ గడ్డనుంచే శ్రీకారం చుట్టారని చెప్పారు. దమ్ముంటే ఈటల రాజేందర్ కేసీఆర్ బొమ్మలేకుండా గెలిచిచూపించాలని సవాల్ విసిరారు. 2018 ఎన్నికల్లో తనను ఓడించేందుకు కుట్రలు పన్నారని ఈటల తనపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఈటలది దుర్మార్గాపు ఆలోచన అని, కేసీఆర్ భీ ఫాం ఇచ్చిన తర్వాత మాకు అది పవిత్రగ్రంథంతో సమానం అన్నారు. తమకు ఏ పార్టీలతో సంబంధం లేదని, కేసీఆర్ ఫొటో చూపించి చేసిన అభివృద్ధిని చెప్పుకుంటూ ముందుకెళ్తామన్నారు.
నవంబర్ 9న నామినేషన్..
కరీంనగర్ నియోజకవర్గం నుంచి వచ్చే నెల 9న బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తానని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. అలాగే 10న రెండోవ సెట్ నామినేషన్ వేస్తానని తెలిపారు. ఎన్నికల ప్రచారాన్ని బొమ్మకల్ హనుమాన్ ఆలయంలో పూజలు చేసి ప్రారంభించి నగరంలోని 6వ డివిజన్లో ప్రచారానికి శ్రీకారం చుడతామని తెలిపారు. మానేరు రివర్ ఫ్రంట్ను యూనివర్సల్ స్టూడియోగా మార్చేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. ప్రాజెక్టులపై దుష్ప్రచారం చేసి చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయవద్దని కోరారు. సమావేశంలో మేయర్ వై సునీల్రావు, బీఆర్ఎస్ నగరాధ్యక్షుడు చల్ల హరిశంకర్, గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ మధు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, ఎంపీపీ లక్ష్మయ్య, నాయకులు కర్ర రాజశేఖర్, రవీందర్, శ్యాంసుందర్, జమీలోద్దీన్, రాజమల్లు, శ్రీనివాస్గౌడ్, సంపత్రావు, మహేశ్, కలర్ సత్తన్న పాల్గొన్నారు.