వేములవాడ, ఫిబ్రవరి 14 : తన బైక్ డబ్బులు ఇవ్వలేదని, అందరి ముందు హేళన చేస్తున్నాడని స్నేహితుడిని మరో స్నేహితుడే నమ్మించి గొంతు కోశాడు. ఆ తర్వాత తప్పించుకొని తిరుగుతూ.. బుధవారం పోలీసులకు చిక్కాడు. ఈ మేరకు వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ నాగేంద్రాచారి వివరాలు వెల్లడించారు. వేములవాడ పట్టణంలోని ఓల్డ్ అర్బన్ కాలనీకి చెందిన బాబు, కురుకుంట్ల శ్రీధర్ స్నేహితులు. అయితే, మూడేళ్ల క్రితం ఆ ఇద్దరి మధ్య వచ్చిన చిన్న గొడవలు వచ్చాయి. ఈ కారణంగా బాబు ఆ వాహనాన్ని శ్రీధర్ పెట్రోల్ పోసి తగలబెట్టాడు.
ఈ ఘటనలో శ్రీధర్ తన స్నేహితుడు బాబుకి రూ.లక్ష పరిహారం ఇవ్వడానికి ఒప్పుకొని, 50 వేలు మాత్రమే ఇచ్చాడు. మిగతా డబ్బులు ఇవ్వకుండా స్నేహితుల ముందు శ్రీధర్ చులకనగా మాట్లాడుతున్నాడని బాబు మనసులో పెట్టుకున్నాడు. కక్ష పెంచుకొని తరచూ గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో బాబు ముంబై వెళ్లి తిరిగి పది రోజుల క్రితం వేములవాడకు రాగా, బాబును చూసిన శ్రీధర్ కించపరిచే మాటలతో హేళన చేశాడు. దీంతో బాబు విసిగిపోయి శ్రీధర్ను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. సమయం కోసం వేచి చూసి ఆదివారం రాత్రి 11 గంటలకు శ్రీధర్ ఇంటికి వెళ్లాడు.
బయటకు రమ్మని చెప్పి శ్రీధర్ బైక్పైనే వేములవాడ రెండో బైపాస్లో ఉన్న ఓ గెస్ట్హౌస్ పకన ఖాళీ స్థలంలోకి తీసుకెళ్లాడు. అక్కడ శ్రీధర్కు బాగా మద్యం తాగించి, తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతును కోసి హత్య చేశాడు. తర్వాత శ్రీధర్ బండిని తీసుకెళ్లి తప్పించుకు తిరుగుతున్నాడు. గురువారం అందిన సమాచారంతో శివపార్వతులకాలనీ పకన డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద బాబును పోలీసులు పట్టుకొని, రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ కరుణాకర్, ఎస్ఐ అంజయ్య, ఏఎస్ఐ బేగ్ పాల్గొన్నారు.