రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : మరమగ్గంపై పరిమళాలు వెదజల్లే పట్టుచీరను తయారు చేసి మరోసారి ప్రతిభ చాటుకున్నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సాయినగర్కు చెందిన నేత కార్మికుడు నల్ల విజయ్.
ఇప్పటి వరకు అగ్గి పెట్టెలో పట్టే చీర నుంచి మొదలుకుని దబ్బనంలో దూరే చీరలు తయారు చేసిన ఆయన, ఈసారి 27 రకాల సుగంధ ద్రవ్యాలు కలిపి పరిమళాలు వెదజల్లే పట్టుచీరను మరమగ్గంపై రెండు రోజుల్లో తయారు చేశాడు. తయారీలో భాగంగా సుగంధ ద్రవ్యాలను ఉడకబెట్టి యారన్ను అందులో నానబెట్టి ఆరబెట్టాడు. తర్వాత మరమగ్గంపై చీరను నేశాడు. చీర ఖరీదు రూ.12 వేల వరకు ఉంటుందని, ఈ నెల 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చీరను ఆవిష్కరించనున్నట్లు విజయ్ తెలిపారు.