వేములవాడ, మే 9 : 70 కోట్లతో వేములవాడ పట్టణంతో పాటు ఆలయ అభివృద్ధి పనులకు జూన్ మొదటి వారంలో మంత్రి కేటీఆర్తో శంకుస్థాపన చేయించి, ప్రజా ఆశీర్వాద సభ నిర్వహిస్తామని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని మంత్రి కేటీఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారని గుర్తు చేశారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడమే కాకుండా 25 వేల మందితో సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.
విదేశీ పర్యటనకు వెళ్తున్న మంత్రి కేటీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రాజన్న ఆలయ అనువంశిక అర్చకుల సమస్యలను పరిష్కారం కోసం హైదరాబాద్లో దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ను కలిశారు. రాజన్న ఆలయంతో పాటు అగ్రహారం ధర్మకర్తల మండలి నియామకం, ఆలయ అభివృద్ధి ధూపదీప నైవేద్యాలు, తదితర అంశాలపై చర్చించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనువంశిక అర్చకులకు గుర్తింపు కార్డులతో పాటు అర్చక నియామకాలు చేపట్టాలని సూచించినట్లు చెప్పారు.