వీణవంక/ తిమ్మాపూర్ రూరల్/ చిగురుమామిడి/ గన్నేరువరం/ సైదాపూర్/ గంగాధర, ఫిబ్రవరి 2: ఐదేండ్లు ప్రజలకు సేవలందించి పదవీ కాలం పూర్తి చేసుకున్న సర్పంచులను శుక్రవారం ఆయా పంచాయతీల్లో ఘనంగా సన్మానించారు. వీణవంక మాజీ సర్పంచ్ నీల కుమారస్వామి, ఉపసర్పంచ్ భానుచందర్, వార్డు సభ్యులను పంచాయతీ కార్యాలయంలో వైస్ ఎంపీపీ రాయిశెట్టి లత-శ్రీనివాస్, ఎంపీడీవో కే శ్రీనివాస్ సత్కరించి, వారి సేవలను కొనియాడారు. అనంతరం మాజీ పాలకవర్గం పంచాయతీ కార్మికులతోపాటు కార్యదర్శి రవూఫ్, సిబ్బందిని సన్మానించింది.
కార్యక్రమంలో ఎంపీవో ప్రభాకర్, జూనియర్ అసిస్టెంట్ హఖీమొద్దీన్, కో ఆప్షన్మెంబర్ ప్రహ్లాదరావు తదితరులు పాల్గొన్నారు. తిమ్మాపూర్ మండలం రామ హనుమాన్నగర్ మాజీ సర్పంచ్ యాదగిరి వెంకటేశ్వరరావును గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. బీఆర్ఎస్ నాయకుడు వడ్డె రాజిరెడ్డి, ప్రత్యేకాధికారి కార్తీక్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అలాగే చిగురుమామిడి మండలం ముదిమాణిక్యంలో బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు బోయిని రమేశ్ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ జకుల రవి, మాజీ వార్డు సభ్యులను సన్మానించారు.
గన్నేరువరం మండలం పారువెల్ల మాజీ సర్పంచ్ తీగల మోహన్ రెడ్డి దంపతులను, పాలకవర్గ సభ్యులను గ్రామస్తులు సత్కరించారు. ప్రత్యేకాధికారి కిరణ్మయి, పంచాయతీ కార్యదర్శి చిరంజీవి నాయకులు చంద్రారెడ్డి, పీచు మహేందర్ రెడ్డి, మల్లారెడ్డి, బోడ ప్రతాపరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. సైదాపూర్ మండలంలోని అన్ని గ్రామాల తాజా మాజీ సర్పంచులను ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్రెడ్డి, వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి ఘనంగా సన్మానించారు. గంగాధర మండలం కొండాయపల్లి తాజా మాజీ సర్పంచ్ ఆముదాల వెంకటమ్మ, వార్డు సభ్యులను ర్యాలపల్లి ఎంపీటీసీ అట్ల రాజిరెడ్డి శాలువాలతో సత్కరించారు.