వేములవాడ, ఫిబ్రవరి 27: కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన ప్రతిసారి బండి సంజయ్ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయడానికి కరీంనగర్ ఏమైనా పునరావాస కేంద్రమా..? అని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఎద్దేవా చేశారు. గడిచిన ఐదేళ్లలో ఎంపీగా ఆయన కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకు ఏ మాత్రం సేవ చేయలేదని, వారి పార్టీకి మాత్రమే సేవ చేశారని ధ్వజమెత్తారు. దేశంలో దీటైన ప్రతిపక్షం లేక కేంద్రంలోని బీజేపీ అతి విశ్వాసంతో ఉందన్నారు. వేములవాడలోని ఓ ఫంక్షన్ హాల్లో మంగళవారం వేములవాడ నియోజకవర్గస్థాయి బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం పార్టీ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు అధ్యక్షతన నిర్వహించగా, పార్టీ ప్రజాప్రతినిధులు, గ్రామ, మండలస్థాయి కమిటీల సభ్యులు, నాయకులు ముఖ్య కార్యకర్తలు దాదాపు 1500 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రేణులను ఉద్దేశించి వినోద్కుమార్ ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నిలక ఫలితాల తర్వాత ఓటమిపై 20 రోజులు అధ్యయనం చేశామని చెప్పా రు. జరిగిన తప్పిదాలను సరిదిద్దుకొని ముందుకెళ్దామని పిలుపునిచ్చారు. గులాబీ పార్టీ పుట్టినరోజు కూడా ఎంతోమంది ఉంటదా..? అని అవహేళన చేశారని గుర్తుచేశారు. పార్టీ అధినేత కేసీఆర్ సారథ్యంలో కానిది అయ్యేలా సాధించింది గులాబీ పార్టీయేనని స్పష్టం చేశారు.
తలాపున పారుతున్న గోదావరిని 400 మీటర్లకు ఎత్తి కోటి ఎకరాలకు సాగునీరు అందించారన్నారు. గతంలో ప్రకాశం బ్యారేజ్, బంగ్లాదేశ్-కలకత్తా సరిహద్దులో ఉన్న బ్యారేజ్లు కొట్టుకపోతే రిపేర్ చేయలేదా? అని ప్రశ్నించారు. 86 పిల్లర్లతో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు పిల్లర్లు కుంగితే రేవంత్ ప్రభుత్వం ఎందుకు మరమ్మతులు చేయడం లేదని నిలదీశారు. ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకపోయి చంద్రబాబుకు నీళ్లు అందాలనే కుట్రపూరితమైన కోణం ఉందని ఆరోపించారు. రోజూ ఐదు వేల క్యూసెక్కుల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఏనాడైనా ఒక మంచి పని చేశాయా అని ప్రశ్నించారు. బీజేపీ నుంచి కేంద్రమంత్రులుగా ఉండి కూడా ఏమీ ఒరగబెట్టలేదని మండిపడ్డారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్కు రైలును తీసుకరావడమే కాకుండా మోదీతో శంకుస్థాపన చేయించానని గుర్తు చేశారు. రాష్ట్రంలో గ్రామస్థాయి నుంచి పట్టణం వరకు బలమైన పార్టీగా బీఆర్ఎస్ ఉందని, మనకు ఉన్న శక్తి కాంగ్రెస్, బీజేపీకి లేదన్నారు. ప్రజల మీద ప్రేమాభిమానాలతో నడుచుకొని, విశ్వాసంతో పనిచేస్తే మళ్లీ విజయం మనదే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. తాను ఒక కార్యకర్తగా, నాయకుడిగా అందుబాటులో ఉంటానని, ఎప్పుడు ఏ సమస్య ఉన్నా సంప్రదించాలని సూచించారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ ఆత్మగౌరవం ఇష్టపడని వ్యక్తి రేవంత్
తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇష్టపడని వ్యక్తి సీఎం రేవంత్రెడ్డి. సమైక్యవాదం అనే పర్వతాన్ని ఎత్తి బయటపడేసిన శక్తి బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రజలది. ఆంధ్రా పార్టీలను, ఢిల్లీని గడగడలాడించి రాష్ర్టాన్ని కేసీఆర్ నాయకత్వంలో సాధించుకున్నాం. రేవంత్రెడ్డి ఎవరి శిష్యుడో మనకందరికీ తెలుసు. ఆయనకు ఓనమాలు నేర్పిన చంద్రబాబుకు మనం మూడు చెర్ల నీళ్లను తాగించాం. ఉద్యమం తీవ్రం కాకపోతే కరీంనగర్కు వచ్చిన సోనియాగాంధీ.. మీ మనస్సులో ఏమున్నదో నాకు తెలుసు? అని ఎందుకు అన్నదో కాంగ్రెస్ నాయకులకే తెలియాలి. తెలంగాణ పోరాట చరిత్రను సీఎం రేవంత్రెడ్డి మలిపి వేయాలనుకుంటున్నారు. నాడు ఉద్యమంలో ఆయన పాత్ర ద్రోహం మాత్రమే ఉన్నందున కుట్ర పన్నుతున్నారు. పరిపాలన సౌధం ఎదుట ఆత్మగౌరవానికి ప్రతీకైన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని కేసీఆర్ సంకల్పిస్తే.. ఢిల్లీ అడుగులకు మడుగులు ఒత్తే రేవంత్.. రాజీవ్గాంధీ విగ్రహం పెట్టాలనుకోవడం తెలంగాణపై ఉన్న వివక్షకు నిదర్శనం. ప్రభుత్వ లోగోను తప్పు పడుతూ కాకతీయుల సంస్కృతిని కాదంటున్న ఆయన పనితీరుపై ఉన్న పరిజ్ఞానం ప్రజలు అర్థం చేసుకోవాలి. తెలంగాణకు బీఆర్ఎస్సే శ్రీరామ రక్ష అని గుర్తుంచుకోవాలి.
– దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్సీ
వినోద్కుమార్ గెలుపుకోసం శ్రమించాలి
కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ నియోజకవర్గానికి ఒరగబెట్టింది ఏమీ లేదు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో వినోద్కుమార్ గెలుపుకోసం ప్రతి కార్యకర్తా శ్రమించాలి. నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తకు నేను అందుబాటులో ఉండి అండగా ఉంటా.
– చల్మెడ లక్ష్మీనరసింహారావు, నియోజకవర్గ ఇన్చార్జి