సిరిసిల్ల టౌన్, నవంబర్ 27: కేసీఆర్ పోరాట స్ఫూర్తికి నిదర్శనం దీక్షా దివస్ అని, ఇది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకమని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ అభివర్ణించారు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అన్న నినాదంతో నాడు కేసీఆర్ ప్రాణాలకు తెగించి నవంబర్ 29 రోజు రాష్ట్ర ఏర్పాటు చరిత్రలో దీక్షా దివస్గా నిలిచిపోయిందని గుర్తు చేశారు. ఇది ఆనాడు ఉద్యమ నేతగా కేసీఆర్ తీసుకున్న గొప్ప నిర్ణయమన్నారు. తెలంగాణ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించేందుకు ఏటా దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు.
సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ అని, పదేళ్ల పాలనలో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే నంబర్వన్గా నిలిపిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. నాడు తెలంగాణ రాష్ర్టాన్ని ఇస్తున్నామని ప్రకటించి మళ్లీ వెనక్కి తీసుకొని ప్రజల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ తుపాకులు పట్టుకుని బెదిరించిన వ్యక్తులే ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి, రైజింగ్ అని మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్పై అబద్ధాలు, దుష్ప్రచారం చేసిన వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పుట్టిందే బీఆర్ఎస్ పార్టీ అన్నారు. దగా పడ్డ తెలంగాణ కోసం కేసీఆర్ రాజకీయ ఉద్యమాన్ని గులాబీ జెండా ద్వారా తీసుకొచ్చారని గుర్తు చేశారు. నాడు తెలంగాణ ఉద్యమాన్ని వదిలిపెడితే రాళ్లతో కొట్టి సంపండని ప్రజలకు చెప్పిన గొప్ప నాయకుడు ఆయన అని ప్రశంసించారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, పదేండ్ల పాలనలో అభివృద్ధి చేసి చూపించారని కొనియాడారు. రాష్ట్రం ఉన్నంత వరకు గులాబీ జెండా ఉంటుందని స్పష్టం చేశారు.
అనంతరం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో దీక్షా దివస్ నిర్వహించే స్థలాన్ని ఆయన పరిశీలించారు. దీక్షా దివస్ వేదిక వద్ద ఉద్యమ ప్రస్థానానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉద్యమకారులు, పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజవయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, టీపీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జడ్పీ మాజీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొల్లి రామ్మోహన్, న్యాలకొండ రాఘవరెడ్డి, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, నాయకులు గుండారపు కృష్ణారెడ్డి, కుంబాల మల్లారెడ్డి, అడ్డగట్ల మురళి, దార్నం లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.