కొడిమ్యాల, జనవరి 8: కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ఈ ఐదేండ్ల కాలంలో చేసిందేమీ లేదని, కేంద్రం నుంచి ఐదు కొత్తలు కూడా తీసుకురాలేదని మాజీ ఎంపీ బీ వినోద్కుమార్ విమర్శించారు. కనీసం రైల్వే ప్రాజెక్టులు, నవోదయ విద్యాలయాలు కూడా తేలేదని మండిపడ్డారు. కానీ, తాను 2014లో ఎంపీగా ఉన్నప్పుడే కరీంనగర్కు రైల్వే ప్రాజెక్టు తెచ్చానని, కరీంనగర్ స్మార్ట్ సిటీ కోసం కోట్లాడి వెయ్యి కోట్లు మంజూరు చేయించానని గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, కార్యకర్తలు కుంగిపోవద్దని సూచించారు. శ్రేణులకు ఏ కష్టం వచ్చినా పార్టీ అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని భరోసానిచ్చారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని, కరీంనగర్ గడ్డపై గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
త్వరలోనే తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వస్తారని, అందరికి మంచి రోజులు వస్తాయని హర్షం వ్యక్తం చేశారు. కొడిమ్యాల మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడా రు. రాష్ట్రం ఏర్పడక ముందు నీళ్లు, కరెంట్ కోసం రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని, వ్యవసాయమే ఆగమైపోయిందన్నారు. ఎందరో ఆత్మహత్య చేసుకున్నారన్నారు. తెలంగాణ వస్తే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సి ఉంటుందని అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డి హేళనగా మాట్లాడారని గుర్తు చేశారు. కానీ రాష్ట్రం ఏర్పడగానే 7778 మెగావాట్లు ఉన్న విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 26వేల మెగావాట్లకు పెంచిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్దేనని కొనియాడారు.
నీళ్లు, నిధులు నియామకాల కోసం రాష్ర్టాన్ని సాధించుకున్నామని, ఈ క్రమంలోనే కాళేశ్వరం సహా అనేక ప్రాజెక్టులు నిర్మించుకుని సాగుకు పుష్కలంగా నీరందించామని చెప్పా రు. ఇంకా పవర్ ప్రాజెక్టులు నిర్మించి రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చామని, రాష్ట్రంలోని 1.61 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి యువత కలలు సాకారం చేసినట్లు వివరించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలన్నీ వంద రోజుల్లో అమలు చేయకుంటే ఎక్కడికక్కడ ఎండగడుతామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఈ యేడాది డిసెంబర్కల్లా రాష్ట్రం లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశా రు.
ఎన్నికలకు వారం రోజుల ముందే రైతు బంధు కోసం 7700 కోట్ల నిధులను సమాకుర్చిపెడితే ఇప్పటివరకు డబ్బులు రైతు ఖాతాల్లో ఎందుకు జమ చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్కు తెలంగాణను బంగారు పల్లెంలో పెట్టి అప్పగించామని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపుకోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు.
కేసీఆర్ సర్కా రు చేసిన అభివృద్ధి, ఇంటింటికీ అందించిన సంక్షేమ ఫలాలను వివరించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పులి వెంకటేశంగౌడ్. ఎంపీపీ మేన్నేని స్వర్ణలత, కొడిమ్యాల సింగిల్ విండో చైర్మన్ మేన్నేని రాజనర్సింగరావు, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు, ఎంపీటీసీ సభ్యులు ఉట్కూరి మల్లారెడ్డి, చీకట్ల సింధు, సామల్ల లక్ష్మణ్, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు నసిరుద్దీన్, సర్పంచులు భూక్య బోజ్జ నాయక్, మల్యాల మహిపాల్, ఏగుర్ల తిరుపతి, గరిగంటి మల్లేశం, నాయకులు అంకం రాజేశం, బండపెల్లి అంజన్కుమార్, నాగి శేఖర్, కొత్తూరి స్వామి, సింగిరెడ్డి తిరుపతిరెడ్డి ఉన్నారు.