శంకరపట్నం, జనవరి 8: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కే పట్టం కట్టాలని మాజీ ఎంపీ బీ వినోద్కుమార్ ప్రజలను కోరారు. సోమవారం తాడికల్ గ్రామంలో పార్టీ మండలస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వినోద్ కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలు చేయకుంటే ప్రజలు రోడ్లెక్కే రోజులు వస్తాయన్నారు. ఎంపీగా బండి సంజయ్ కేంద్రం నుంచి నయాపైసా తేలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం పదేళ్ల పాలనలో 1.61 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినట్లు వెల్లడించారు. రైతుబంధు నిధులు ఎక్కడికి పోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో యువతకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.
కేసీఆర్ సర్కారు పదేళ్లలో ఇరిగేషన్, విద్యుత్ ప్రాజెక్టుల కోసమే అప్పులు చేసిందని వివరించారు. ఐదేళ్లలో ఎంపీగా బండి సంజయ్ జిల్లాకు చేసిన సేవలు శూన్యమన్నారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ర్టాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపామన్నారు. తెలంగాణ గళం పార్లమెంట్లో వినిపించాలంటే బీఆర్ఎస్ను ప్రజలు గెలిపించాలని కోరారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు వారం ముందు రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ చేసేందుకు నిధులు కేటాయిస్తే, వారికి నిలిపివేసి ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని, అసలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వేశారా.. ఇంకెవరికైనా ప్రభుత్వం బిల్లులు చెల్లించిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
2014 నుంచి 2019 వరకు తాను ఎంపీగా ఉన్న కాలంలో గోదావరి, కృష్ణ నదులపై నిర్మాణం చేస్తున్న ప్రాజెక్టులు, పవర్ ప్రాజెక్టులకు అనుమతులు సాధించుకున్నట్లు గుర్తు చేశారు. పదేళ్ల కాలంలో తొలి సీఎం కేసీఆర్ దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలిపినట్లు పేర్కొన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ఎక్కడ చూసినా నెర్రెలు బారిన నేలలు కనిపించేవని తెలిపారు. కేసీఆర్ అధికారం చేపట్టాక మూడున్నరేళ్ల కాలంలోనే భారీ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించామని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటయ్యాక విద్యుత్ రంగంలో గణనీయంగా 26 వేల మెగావాట్ల ఉత్పత్తిని సాధించినట్లు చెప్పారు.
పదేళ్లలో 1.61 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఉద్యోగులకు జీతాలు ఇచ్చారో లేదో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తన హామీ నెరవేర్చుకోవాలని గుర్తు చేశారు. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ గడ్డపై గులాబీ జెండా ఎగురడం ఖాయమన్నారు. కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్, సతీశ్రెడ్డి, సంజీవరెడ్డి, పలు గ్రామాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చొప్పదండి, జనవరి 8: మండల కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర మణికంఠ ఆలయ వార్షికోత్సవంలో భాగంగా ఆదివారం రాత్రి మహా పడిపూజ మహోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి ఫల పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించగా, కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యుడు బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు.