గంగాధర, ఫిబ్రవరి 22 : రాష్ట్రంలో రాక్షస పాలన నడస్తున్నదని, ముఖ్యమంత్రి రేవంత్ ప్రభుత్వంలో కులవివక్ష కొనసాగుతున్నదని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. గంగాధర మండలం గర్శకుర్తిలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలకూ ప్రాధాన్యం ఇచ్చారని, ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించారని కొనియాడారు.
రజకులకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిందని గుర్తు చేశారు. కానీ, రేవంత్ పాలనలో కులవివక్ష కనిపిస్తున్నదని మండిపడ్డారు. నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న దర్శనానికి వచ్చిన రజక కుటుంబంపై ఆలయ నిర్వాహకులు, కాంగ్రెస్ నాయకులు మూక్ముముడిగా దాడి చేశారని ఆగ్రహించారు. కాంగ్రెస్ గూండాల దాడిలో రెండేళ్ల చిన్నారి మృతి చెందడం బాధాకరమన్నారు. చిన్నారి మృతికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ చిందం ఆంజనేయులు, నాయకులు తడిగొప్పుల రమేశ్, మామిడిపెల్లి అఖిల్, రజక సంఘం అధ్యక్షుడు లింగంపెల్లి అనిల్, తదితరులు పాల్గొన్నారు.