మానకొండూర్, ఫిబ్రవరి 4: అల్గునూర్లోని లక్ష్మీనరసింహా కన్వెన్షన్హాల్లో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించే బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. మండల కేంద్రంలో ఆదివారం ఆయన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సమావేశానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు, మాజీ ఎంపీ వినోద్కుమార్ హాజరవుతారని తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగుర వేయడానికి బీఆర్ఎస్ శ్రేణులంతా కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. ఎంపీ బండి సంజయ్ ఐదేళ్లలో మానకొండూర్ నియోజకవర్గ అభివృద్ధికి నయాపైసా కూడా తేలేదన్నారు.
గతంలో వినోద్కుమార్ ఎంపీగా ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధికి రూ. 5 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. వినోద్కుమార్ లాంటి మేధావిని గెలిపిస్తే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి అనేక నిధులు తీసుకువస్తాడని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆచరణకు అమలు కానీ హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు.
సమావేశానికి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్గౌడ్, బీఆర్ఎస్వై నియోజకవర్గ అధ్యక్షుడు గూడురి సురేశ్, నియోజకవర్గ అధికార ప్రతినిధి శాతరాజు యాదగిరి, నాయకు లు రొడ్డ పృథ్వీరాజ్, ఎరుకల శ్రీనివాస్గౌడ్, నెల్లి మురళి, కొత్తకొండ నాగయ్య, దండు రాములు, ఇస్కుల్ల ఆంజనేయులు, కడారి ప్రభాకర్, గంగుల రవి పాల్గొన్నారు.
అల్గునూర్లోని లక్ష్మీనరసింహ కన్వెన్షన్ హాల్లో సమావేశ ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు పరిశీలించారు. నాయకులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.