వెల్గటూర్, జనవరి 12: ‘అధికారం లేదని కార్యకర్తలు అధైర్య పడద్దు. పార్టీ అన్ని విధాల అండగా ఉంటుంది’ అంటూ బీఆర్ఎస్ శ్రేణులకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ భరోసానిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని, ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ఆశీస్సులతో 20 ఏండ్ల నుంచి ఎమ్మెల్యేగా, విప్గా, మంత్రి హోదాల్లో ప్రజల కోసం పనిచేశానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు చిన్న బ్రేక్ వచ్చిందని పేర్కొన్నారు. వెల్గటూర్ మండలంలోని కిషన్రావుపేటలో శుక్రవారం వెల్గటూర్, ఎండపల్లి మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
కొప్పుల హాజరై మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని చెప్పారు. కొత్త ప్రభుత్వం ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, కానీ సర్కారు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బీఆర్ఎస్పై కక్ష సాధిస్తున్నదని మండిపడ్డారు. ‘మంచి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నాం’ అని ప్రజల్లో ఇప్పటికే ఆలోచన మొదలైందన్నారు. కార్యకర్తలను వేధిస్తే ఊరుకోబోమని, అందుకు లీగల్ సెల్ ఏర్పాటు చేశామని చెప్పారు. దళితబంధు అమలు కోసం పోరాటం చేయాలని నాయకులకు సూచించారు.
పార్లమెంట్ ఎన్నికలకు సమాయాత్తం కావాలని, మళ్లీ గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఇక్కడ ఎంపీపీ కునమల్ల లక్ష్మి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చల్లూరి రాంచందర్గౌడ్, సింహాచలం జగన్, జుపాక కుమార్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు పోడేటి సతీశ్, ఎంపీటీసీలు గాజుల మల్లేశం, మూగల రాజేశ్వరి-సత్యం, సర్పంచులు మేర్గు కొమురయ్య, ముల్కల్ల గంగారాం, గంగుల నగేశ్, బోడకుంటి రమేశ్, మారం జలేందర్రెడ్డి, ప్యాక్స్ చైర్మన్లు గూడ రాంరెడ్డి, గోలి రత్నాకర్ పాల్గొన్నారు.