పై చదువుల కోసం ఉమ్మడి జిల్లా నుంచి అమెరికా బాట పడుతున్న యువత సంఖ్య పెరుగుతున్నది. నాడు మాస్టర్ డిగ్రీ కోసమే వెళ్లినా.. నేడు డిగ్రీ చదివేందుకు సైతం అక్కడికి వెళ్తున్నది. ఆర్థిక స్థోమతను బట్టి ఎంబీఏతోపాటు బయోటెక్నాలజీ, బయోమెడికల్ సైన్సెస్ వంటి కోర్సులు చేసేందుకు మక్కువ చూపుతున్నది. కలల సౌధం కేంద్రంగా తమ కలలను సాకారం నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది.
ఒకప్పుడు ఏటా అమెరికా వెళ్లే విద్యార్థుల సంఖ్య ఉమ్మడి జిల్లా మొత్తంలో వంద, రెండు వందల్లోపు మాత్రమే ఉంటే.. ఇప్పుడు దాదాపు 1500 నుంచి 2 వేల వరకు చేరింది. దీనిని బట్టి చూస్తే యువతీ యువకుల్లో ఆసక్తి ఎంతగా ఉన్నదో అర్థమవుతున్నది. అంతేకాదు, మున్ముందు వీరి సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా వెళ్లి చదవాలనుకునే వారు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
కరీంనగర్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఒకప్పుడు మన విద్యార్థులు మాస్టర్స్ చేయడానికి మాత్రమే ఎక్కువగా అమెరికా వెళ్లేది. కానీ, ఇప్పుడు ఆసక్తి, ఆర్థిక స్థోమతను బట్టి డిగ్రీ కోర్సులు సైతం చదడానికి వెళ్తుండడం కనిపిస్తున్నది. అంతేకాదు, అక్కడి విశ్వవిద్యాలయాలు అందిస్తున్న భిన్న కోర్సులు చేయడానికి మన పిల్లల నుంచి రోజురోజుకూ డిమాండ్ పెరుగుతున్నది. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్ అండ్ అనలిటిక్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వంటి కోర్సులపై మక్కువ చూపుతుండగా, ప్రధానంగా కంప్యూటర్ సైన్స్ టెక్నాలజీ ప్రోగ్రామ్లకు డిమాండ్ ఉంటున్నది.
ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి స్పెషలైజేషన్ కోర్సులకు కూడా క్రేజ్ ఉన్నది. మరోవైపు ప్రతి కంపెనీ.. తన అభివృద్ధి కోసం డాటాపై దృష్టి పెడుతూ.. ఈ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పిస్తుండగా, డేటా సైన్స్ అనలిటిక్స్ కోర్సులపై చాలా మంది విద్యార్థులు ఫోకస్ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఎంబీఏ కోర్సులకు డిమాండ్ పెరుగుతుండగా, ఫైన్సాన్స్, మార్కెటింగ్, ఎంటర్ ప్రైన్యూర్షిప్ కోర్సులను చేసేందుకు సైతం ఆసక్తి చూపుతున్నారు.
ఆర్థికంగా ఎదిగిన దేశమైన యూఎస్ఏలో ఈ రంగానికి సంబంధించి మంచి కోర్సులను అందిస్తుండగా, ఆర్థిక శాస్త్రం, ఫైనాన్స్ సంబంధిత విభాగాల్లో కోర్సులు చేసేందుకు వెళ్తున్నారు. ఇంకా హెల్త్కేర్, నర్సింగ్, ఫార్మసీ, పబ్లిక్ హెల్త్ విభాగంలో అత్యాధునిక కోర్సులను అందిస్తుండగా, వీటిపైనా దృష్టి పెడుతున్నారు. ఇంజినీరింగ్ విషయానికి వస్తే.. ఎలక్ట్రికల్, మెకానికల్, ఎరోస్పేస్ ఇంజినీరింగ్ చేయడానికి మక్కువ చూపుతున్నారు.
మానసిక ఆరోగ్య వృత్తిపైనా విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. సైకాలజీ, కౌన్సెలింగ్ కోర్సులు చేసేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. క్లినికల్ సైకాలజీ, కౌన్సెలింగ్తో సైకాలజీ ప్రోగ్రాంలకు ప్రసిద్ధిగాంచిన ఉన్న యూఎస్ఏలో ఆ కోర్సులు చేసేందుకు వెళ్తున్నారు. బయోటెక్నాలజీ, బయోమెడికల్ సైన్సెస్ రంగంలో ప్రముఖ పరిశోధన సంస్థలు ఇక్కడ అందుబాటులో ఉండగా, జన్యు ఇంజినీరింగ్, బయోఫిజిక్స్, బయో ఇన్ఫర్మేటిక్స్కు సంబంధించి డిగ్రీలను అభ్యసించడానికి ఆ దేశ బాట పడుతున్నారు. ఇలా విభిన్న కోర్సులను చదివేందుకు వెళ్తున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతున్నది.
ఏటా రాష్ట్రం నుంచి అమెరికాకు వెళ్తున్న వారి సంఖ్య 15 వేలకు పైగానే ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో హైదరాబాద్ తర్వాత మన ఉమ్మడి జిల్లావాసులే అధికంగా ఉంటుండగా, అందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 13 ఇంజినీరింగ్ కళాశాలున్నాయి. అందులో రెండు ప్రభుత్వ, 11 ప్రైవేటు కళాశాలున్నాయి. అన్ని కోర్సులు కలిపి దాదాపు 4 వేల సీట్లున్నాయి. అలాగే, ఉమ్మడి జిల్లాకు చెందిన వేలాది మంది విద్యార్థులు హైదరాబాద్లోని అనేక ఇంజినీరింగ్ కాలేజీల్లో చదువుతున్నారు.
ఒక అంచనా ప్రకారం ఐదు వేల మంది ఇంజినీరింగ్ పూర్తి చేస్తున్నారు. అయితే, అమెరికా వెళ్తున్న వారిలో హైదరాబాద్ తర్వాత మన కరీంనగర్ జిల్లావాసులే అధిక సంఖ్యలో ఉంటున్నారు. న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్, డీసీ, కాలిఫోర్నియా, మిచిగాన్, తదితర రాష్ర్టాల్లో మన జిల్లాకు చెందిన వేలాది మంది చదువుతోపాటు ఉపాధి పొందుతున్నారు. 2000 సంవత్సరం నుంచి అమెరికాకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతూ వస్తుండగా, తాజా అంచనాల ప్రకారం ఏటా ఉమ్మడి జిల్లా నుంచి పైచదువుల కోసం 1500 మంది వరకు వెళ్తున్నారు.
ప్రస్తుతం అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో సీట్లు పొందిన విద్యార్థులు జనవరిలో చేరాల్సి ఉండగా, అందుకోసం ఇప్పటి నుంచే ఒక్కొక్కరిగా వెళ్తున్నారు. దీంతో విమానాలు రేట్లను సైతం అమాంతం పెంచారని విద్యార్థులు వాపోతున్నారు. ఏటా డిసెంబర్, జనవరి, జూలై, ఆగస్టులో విమాన చార్జీలు.. సాధారణ చార్జీలతో పోలిస్తే రెండు లేదా మూడింతలు పెరుగుతున్నాయని చెబుతున్నారు.
అమెరికాలో సుమారు 4500 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలున్నాయి. ర్యాంకింగ్ ఆధారంగా వాటిని టైర్-1, 2, 3గా వర్గీకరిస్తారు. వాస్తవానికి టైర్-1, 2లు 500కు మించి ఉండవన్నది నిపుణలు చెప్తున్న మాట. అక్కడి ప్రభుత్వ గుర్తింపు పొందిన కొన్ని సంస్థలు ఆయా విద్యాసంస్థలకు ర్యాంకింగ్ అక్రిడిటేషన్లు ఇస్తుంటాయి. అయితే, ప్రభుత్వ వర్సిటీలు నాణ్యమైనవి, ప్రైవేట్ నాసిరకమైనవి అని చెప్పలేమంటున్నారు నిపుణులు. కొన్ని స్కాలర్ షిప్లు మంజూరు చేస్తే.. మరికొన్ని మంజూరు చేయవని, ఆయా వర్సిటీల వెబ్సైట్లను, యూఎస్ కాన్సులేట్ వెబ్సైట్లను పరిశీలిస్తే పూర్తి అవగాహన వస్తుందని చెబుతున్నారు.
అయితే, వీటిని ఆధారంగా చేసుకొని మెజార్టీ యువతీ యువకులు ఉన్నత విద్య కోసం అమెరికా బాట పడుతున్నారు. అక్కడ మంచి విశ్వవిద్యాలయంలో.. అనుకున్న కోర్సుల్లో చేరడానికి సీట్ల కోసం పోటీ పడుతున్నారు. ఒక్కో విద్యార్థి తాను డిగ్రీ పూర్తి చేసిన సంబంధిత విశ్వవిద్యాలయాలకు 5 నుంచి 10 ట్రాన్స్స్క్రిప్టుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.
యూఎస్ఏ విశ్వవిద్యాలయాల దరఖాస్తుకు ఒరిజనల్ మార్కుల ధ్రువపత్రాలను పొందుపరచలేరు కావున.. రాష్ట్రంలోని ఆయా విశ్వవిద్యాయాల రిజిస్ట్రార్ లేదా పరీక్షల విభాగం అధికారులు సంతకం చేసిన ట్రాన్స్స్క్రిప్టులను విద్యార్థులు తీసుకుంటున్నారు. ఒక్కో విద్యార్థి 10 నుంచి 15 వరకు ట్రాన్స్స్క్రిప్టులు తీసుకుంటున్నారని ఆయా విశ్వవిద్యాయాల అధికారులు ప్రకటిస్తున్నారు. ఇవి తీసుకునే వారి సంఖ్య ఏయేటికాయేడు పెరుగుతున్నదని, దీనిని చూస్తే అమెరికా వెళ్లే వారి సంఖ్య ఎలా పెరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు.
అమెరికా వెళ్లి ఎంఎస్ చేయాలనుకునే యువత ఒక ఆరు నెలల నుంచి దాని కోసం ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. ఐఎల్ట్స్, జీఆర్ఈ పరీక్షకు ప్రిపేర్ కావాలి. ఆ పరీక్ష కోసం అవసరమైతే కోచింగ్ కూడా తీసుకోవాలి. ఆ దేశంలోని ప్రభుత్వ యూనివర్సిటీలకు ఐప్లె చేసుకునేందుకు 45 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. యూనివర్సిటీలలో మంచి ఫ్యాకల్టీతో పాటు, అన్ని రకాల వసతులు అందుబాటులో ఉంటాయి. పరీక్షలు క్లియర్ చేసిన విద్యార్థులకు ఇప్పుడు ఎక్కువగా లోన్ విషయంలో ఇబ్బందులు వస్తుంటాయి. ఇందుకు ప్రధాన కారణం తల్లిదండ్రులకు ఐటీ రిటర్స్ లేకపోవడం. అలాంటి వారు ముందుగా ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తే సులువుగా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది.
– గంజి అభిషేక్, సిగ్ ఓవర్సీస్, కరీంనగర్