ఇల్లందకుంట, జనవరి 9: ‘25 లక్షలు ఇవ్వు. లేకుంటే నీవు అవినీతి అక్రమాలు చేసినట్టు ఫైల్ తయారు చేస్తం. ముఖ్యమంత్రికి పంపిస్తం’ అంటూ ఓ అధికారిని నలుగురు వ్యక్తులు బెదిరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పరారులో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నారు. ఇల్లందకుంట ఎస్ఐ రాజ్కుమార్ వివరాల ప్రకారం.. మండలంలోని పాతర్లపల్లి గ్రామానికి చెందిన అబ్బిడి సురేందర్రెడ్డి, జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మొగలపల్లి మండలం గుండ్లకర్తి గ్రామానికి చెందిన రియాజ్, కుమారస్వామి, సురేశ్ స్నేహితులు. వీరంతా కలిసి హైదరాబాద్లోని ఓ అధికారికి ఈ నెల 4, 5 తేదీల్లో ఫోన్ చేసి 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకుంటే అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఫైల్ తయారు చేసి, సీఎంకు పంపిస్తామంటూ బెదిరించారు. దీంతో సదరు అధికారి ఈ నెల 6న ఇల్లందకుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఫోన్ కాల్ ఆధారంగా దర్యాఫ్తు చేసి, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేసి రిమాండ్కు పంపించారు. ఈ కేసులో మరో నిందితుడు సురేశ్ పరారీలో ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు.