కరీంనగర్ రూరల్, జనవరి 23: కరీంనగర్ రూరల్ మండలంలో జ్వర సర్వే పకడ్బందీగా చేపట్టి, త్వరగా పూర్తి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య వైద్య, పంచాయతీ సిబ్బందికి సూచించారు. మండలంలోని నగునూర్ గ్రామంలో చామనపల్లి ప్రాథమిక ఆర్యోగ కేంద్రం వైద్యురాలు శిరీష ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది మంజుల, స్వరూప జ్వర సర్వే చేపట్టారు. కాగా, సిబ్బంది ప్రజల ఆరోగ్య వివరాలు సేకరిస్తున్న తీరును డీపీవో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారిని గుర్తించి, మందులు అందజేయాలని సూచించారు. ఐదు రోజుల తర్వాత తగ్గకుంటే కరోనా నిర్ధారణ పరీక్ష చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. పాజిటివ్ వస్తే హోం ఐసొలేషన్లో ఉండాలని సూచించి, రోజూ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు. సర్వే సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు. కాగా, గోపాల్పూర్ గ్రామంలో సర్పంచ్ ఊరడి మంజుల ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు ఇంటింటా సర్వే చేపట్టారు.
దుర్శేడ్లో ఉపసర్పంచ్ సుంకిశాల సంపత్రావు ఆధ్వర్యంలో కారోబార్ మురళి, సింగిల్ విండో డైరెక్టర్ గాజుల అంజయ్య, హెల్త్ సూపర్వైజర్ బాలయ్య, ఏఎన్ఎం పద్మ, ఆశవర్కర్లు లక్ష్మి, సరోజ, అంగన్వాడీ టీచర్లు పద్మ, విజయ, వాణి ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలు సేకరించారు. నగునూర్ గ్రామంలో సర్పంచ్ ఉప్పు శ్రీధర్, ఎలబోతారంలో ఎంపీటీసీ చల్ల రామక్క, చెర్లభూత్కూర్లో ఏఎన్ఎం సరోజన ఆధ్వర్యంలో వైద్య, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీలు ఇంటింటా జ్వర సర్వే నిర్వహించారు. కార్యక్రమాల్లో సర్పంచ్ దబ్బెట రమణారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, ఉపసర్పంచ్ చిట్కూరి శేఖర్, కూర శ్యాంసుందర్ రెడ్డి, ఆశ వర్కర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి, జనవరి 23: కొత్తపల్లి మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులో వైద్య, పంచాయతీ, పురపాలక శాఖల సిబ్బంది జ్వర సర్వే చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలు సేకరించారు. కరోనా లక్షణాలు ఉన్న వారికి మందులు అందజేశారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. కాగా, పట్టణంలో చేపట్టిన జ్వర సర్వేను అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, డీఎంహెచ్వో జువేరియా పర్యవేక్షించారు. సర్వే సిబ్బందికి పలు సూచనలు చేశారు. సర్వేలో కౌన్సిలర్ గండు రాంబాబు, మున్సిపల్ సిబ్బంది రమేశ్, ఆర్పీలు సంధ్య, సరస్వతి, అంగన్వాడీ టీచర్ భారతి తదితరులు పాల్గొన్నారు.