వేములవాడ టౌన్, డిసెంబర్ 16: ఒక చేతిలో చిరతలు, మరో చేతిలో తంబుర, శిరస్సుపై కుంభం, మెడలో పూలహారం ధరించి, హరిలో రంగ హరి అంటూ.. నిరంతరం హరినామస్మరణతో హరిదాసులు సందడి చేసే పవిత్ర ధనుర్మాసం ఆదివారం నుంచి ప్రారంభంకానున్నది. హిందువులు ఈ మాసాన్ని సంక్రాంతి నెల పట్టడం అని కూడా అంటారు. వేములవాడ రాజన్న అనుబంధ దేవాలయమైన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలను ఆనవాయితీగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయగా, ఆలయం వేడుకలకు ముస్తాబైంది.
డిసెంబర్ నెల రెండో పక్షం ఆరంభంలో సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించినప్పటి నుంచి జనవరి మొదటి పక్షం చివరిలో మకర రాశిలోకి ప్రవేశించే వరకు ఉన్న నెల రోజులను ధనుర్మాసం అంటారు. తులసీదాత్రీవన పరివేష్టితుడైన శ్రీహరి వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిస్తారు. ధనుర్మాసంలో గోదాదేవి అమ్మవారు శ్రీరంగనాథుడిని సేవి స్తూ తన చెలికత్తెలతో కలిసి చేసిన శ్లోకాలే రోజుకోపాశురంగా నిలిచిపోయాయి. గోదాదేవి స్వామిని కీర్తించిన పాశురాల్లో ఆత్మ సమర్పణం, ఆత్మ నివేదనమే కనిపిస్తుంది. అనన్యమైన చిత్తవృత్తి, అచంచలమైన భక్తి విశ్వాసాలతో గోదాదేవి అమ్మవారు స్వామివారిని కీర్తించారు. ఈ నెల రోజులపాటు ప్రతి ఇంటి ముందు ముగ్గులు వేసి, ఆవుపేడతో గొబ్బెమ్మలు పెట్టి, వాటిని రంగురంగుల పూలతో అలంకరిస్తారు.
రాజన్న అనుబంధ దేవాలయమైన వేణుగోపాల స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా ప్రారంభంకానున్నాయి. స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్, పూజారి ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తాం. నేటి నుంచి రాజన్న ఆలయంలో ఉదయం 6 గంటలకు ధనుర్మాస ఉత్సవం ప్రారంభంకానున్నది. ఈ నెల 23న ముక్కోటి ఏకాదశి వేడుకలు నిర్వహిస్తాం. వేణుగోపాలస్వామి ఆలయంలో జనవరి 9న హారతి పాశురం, 12న కూడారై, 14 న గోదాశ్రీరంగనాయక కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తాం.
– కృష్ణప్రసాద్, రాజన్న ఆలయ ఈవో