సిరిసిల్ల రూరల్, మార్చి 19: అకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు తంగళ్లపల్లి మండలం ఓబులాపూర్లో నష్టపోయిన వరి పంటలను మంగళవారం క్షేత్రస్థాయిలో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యతో కలిసి ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా నష్టపోయిన రైతులతో మాట్లాడి, ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తక్షణమే క్షేత్రస్థాయిలో పంటలను సర్వేచేసి, నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, సింగిల్విండో చైర్మన్లు బండి దేవదాస్ గౌడ్, కోడూరి భాస్కర్గౌడ్, బీఆర్ఎస్వీ రాష్ట్రనేత జక్కుల నాగరాజు యాదవ్, రైతులు, నాయకులు ఉన్నారు.
దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారమివ్వాలి
అకాల వర్షంతో వరి పంటలు తీవ్రంగా నష్టపోయాయని, రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, సిరిసిల్ల, నేరెళ్ల సింగిల్ విండో చైర్మన్లు బండి దేవదాస్గౌడ్, కోడూరి భాస్కర్ గౌడ్ డిమాండ్ చేశారు. తంగళ్లపల్లి మండలం మండేపల్లి, ఓబులాపూర్, రాళ్లపేట గ్రామాల్లో అకాల వర్షంతో నష్టపోయిన వరి పంటలను మంగళవారం వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం పారదర్శకంగా నష్టపరిహారం అందించి, రైతులకు ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం అందివ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలను మాజీ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. వీరి వెంట పడిగెల రాజు, వైస్ ఎంపీపీ జంగిటి అంజయ్య, ప్యాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణా రెడ్డి, బీఆర్ఎస్ నేతలు, రైతులు ఉన్నారు.
పంటల పరిశీలన
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు, సర్దాపూర్ తదితర ప్రాంతాల్లో అకాల వర్షంతో నష్టపోయిన పంటలను పెద్దూరు సింగిల్విండో చైర్మన్ జీల కిషన్ యాదవ్ వ్యవసాయ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నష్టపోయిన పంటలకు పరిహారం అందివ్వాలని కోరారు. ఆయన వెంట వైస్ చైర్మన్ నారాయణ, డైరెక్టర్లు బాలరాజు, రైతులు శ్రీను, నర్సయ్య, అనిల్, వెంకటేశ్ తదితరులు ఉన్నారు.