మంథని రూరల్, మే3 : గ్రామంలో కాంగ్రెస్ నాయకుల మధ్య వర్గ పోరు రైతులకు శాపంగా మారింది. కష్టించి పండించిన పంట 20 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోనే నిలువ ఉండటంతో అందోళన చెందిన రైతన్నలు చివరకు రోడ్డెక్కి ధర్నాకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని అడవిసోమన్పల్లి గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాల్సిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం గ్రామంలోని కాంగ్రెస్ నాయకుల వర్గ పోరు కారణంగా ప్రారంభం కాకపోవడంతో 20 రోజుల నుంచి తమ పండించిన పంటను అమ్మకం కోసం కొనుగోలు కేంద్రానికి తరలించిన రైతులు, తమ పంటలు కాపాడుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. చివరకు మంథని కాటారం ప్రధాన రహదారి పై ఆదివారం ధర్నాకు దిగారు.
మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 15 రోజుల క్రితమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అయ్యాయి. కానీ అడవిసోమన్పల్లిలో మాత్రం స్థానిక నాయకుల తీరుతో ఇప్పటి వరకు ప్రారంభం కాకపోవడంతో ఇటు అధికారులు, అటు రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. నెల రోజుల క్రితమే గ్రామంలో వరి కొతలు ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వం గిట్టుబాటు ధర అందిస్తుందన్న ఆశతో కొనుగోలు కేంద్రాలకు రైతులు 20 రోజుల క్రితమే తాము పండించిన అమ్మకాల కోసం కొనుగోలు కేంద్రాలకు తరలిస్తే ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రం ప్రారంభం కాకపోపవడంతో కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది.
కొనుగోలు కేంద్రం ప్రారంభించాలని రైతులు ఎన్నిసార్లు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మెరపెట్టుకున్న అధికార పార్టీ నాయకుల వర్గ పోరు కారణంగా అధికారులు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించలేకపోయారు. వాతవరణ మార్పుల కారణంగా ఎప్పుడు వర్షం కురుస్తుందోనని ఒకవైపు భయం మరో వైపు 20 రోజులుగా ధాన్యం కుప్పల వద్ద రైతులు కాపలా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడటంతో రైతులు చివరకు విసుకు చెంది ప్రధాన రహదారి పై ధర్నాకు దిగటంతో ఇరు వైపుల పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రైతులను సముదాయించారు. సోమవారం ఉదయం వరకు కొనుగోలు కేంద్రం ప్రారంభించి ధాన్యాన్ని తూకం వేసేలా చూస్తామని హామి ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.