జన్నారం, మే 15 : క్వింటాల్కు ఐదు నుంచి ఆరు కిలోలు కోత విధిస్తున్నారంటూ రైతులు కలెక్టర్ కుమార్ దీపక్కు ఫిర్యాదు చేశారు. శుక్రవారం జన్నారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డుకు వచ్చిన కలెక్టర్కు బీఆర్ఎస్ మాజీ ఎంపీపీ సుతారి వినయ్, దేవునిగూడ ఉప సర్పంచ్ కళ్లెం శ్రీనివాస్రెడ్డి, రైతులు ఫిర్యాదు చేయగా, ఆయన అలా జరగకుండా చూస్తామని చెప్పారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కూలీల సంఖ్య పెంచి వెంట వెంటే ధాన్యాన్ని గోదాములకు తరలించాలని ఆదేశించారు.
అనంతరం మండల కేంద్రంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. పాఠశాల ప్రహరీని త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మొర్రిగూడ గ్రామ సమీపంలో ఉన్న రాఘవేంద్ర రైస్ మిల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పౌర సంబంధాల అధికారి బ్రహ్మరావు, తహసీల్దార్ బక్కయ్య, ఎంపీడీవో ఉమర్ షరీఫ్, మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, సర్పంచ్ జక్కు సుష్మాగుప్తా, జక్కు భూమేశ్, పంచాయతీ కార్యదర్శి రాహుల్, ఆర్ఐ భానుచందర్నాయక్ ఉన్నారు.
ధాన్యాన్ని త్వరగా తరలించాలి
లక్షెట్టిపేట, మే 15 : కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులు, గోదాములకు త్వరితగతిన తరలించాలని, ధాన్యం దెబ్బతినకుండా నిల్వ ప్రక్రియ సమర్థవంతంగా చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలోని ధాన్యం గోదామును తహసీల్దార్ దిలీప్కుమార్తో కలిసి సందర్శించారు.