‘ఉదయం ఆఫీస్కు వెళ్లాలి. ఫోన్ వస్తే అక్కడి నుంచి వెంటనే ఫిర్యాదుదారుల వద్దకు పోవాలి. వారి సమస్యలు తెలుసుకోవాలి. అవసరమైతే కౌన్సెలింగ్ ఇవ్వాలి. లేదంటే న్యాయసహాయం కోసం వారి వెంట నడవాలి. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. బాధితులకు అండదండగా నిలువాలి’ ఇలా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ(డబ్ల్యూసీడీ)కి అనుబంధంగా ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులు తొమ్మిది నెలలుగా వేతనాలు రాక ఎదురుచూపులు చూస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ తమ కుటుంబాల ఆలనా, పాలనా చూసుకోలేక తమలో తామే కుమిలిపోతున్నారు.
కరీంనగర్ కలెక్టరేట్, జూలై 3 : కరీంనగర్ జిల్లాలో సఖీ కేంద్రం, మహిళా సాధికారత విభాగం, చైల్డ్ హెల్ప్లైన్ 1098, బాలల సంరక్షణ, సంక్షేమం, తదితర విభాగాల్లో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన 53 మంది వివిధ కేడర్లలో విధులు నిర్వర్తిస్తున్నారు. కుటుంబ కలహాలు, గృహహింస, బాలికలపై వేధింపులు, బాల కార్మికుల రక్షణ, అత్యవసర సహాయక చర్యల విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పుడు ఫోన్ వచ్చినా స్పందింస్తూ.. ఉదయం నుంచి రాత్రి వరకు అవసరమైతే అర్ధరాత్రి కూడా విధుల్లో ఉంటున్నారు.
అలాగే, అటెండర్ నుంచి ఉన్నతాధికారి వరకు చెప్పిన పనులన్నీ చేస్తూ, ప్రభుత్వ పథకాల అమలులో కీలకపాత్ర పోషిస్తున్నప్పటికీ, వీరి వేతనం అంతంతే ఉన్నది. ఉద్యోగార్హతను బట్టి నెలకు రూ.8 వేల నుంచి రూ.25 వేల దాకా వేతనం అందిస్తున్నారు. అయితే వీరికి నెలనెలా వేతనం అందించడంలో జాప్యం జరుగుతున్నది. ఆయా విభాగాలను బట్టి మూడు నెలల నుంచి తొమ్మిది నెలల దాకా పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తున్నది.
అయితే వీరిలో 14 మంది డేటా ఆపరేటర్లకు గురువారమే ఆరు నెలల వేతనాలు ఇచ్చినా.. మిగతా వారికి మాత్రం పెండింగ్లోనే ఉన్నాయి. దీంతో నెలలకొద్దీ ఎదురుచూపులే మిగులుతున్నాయి. తమ కష్టానికి తగిన గుర్తింపు గానీ, సమయానికి వేతనం గానీ దక్కడం లేదని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సేవ పేర వెట్టి చాకిరీ చేస్తూ వేతనం కోసం కార్యాలయాల చుట్టూ నెలల తరబడి ప్రదక్షిణలు చేయాల్సి వస్తున్నదని ఆవేదన చెందుతున్నారు.
చాలా మంది మధ్యతరగతి, పేదకుటుంబాలకు చెందిన వారే ఉన్నారని, తక్కువ జీతంతోనే నెట్టుకొస్తున్నామని వాపోతున్నారు. కుటుంబాలను పోషించుకునేందుకు ఇబ్బంది పడుతున్నామని, ఇంటి అద్దె, కిరాణం, విద్యుత్ బిల్లులు, వైద్య ఖర్చులు, పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించలేక అప్పులపాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు వేతనాలు అందేలా చూడాలని వేడుకుంటున్నారు.
మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖకు అనుబంధంగా ఉన్న పలు విభాగాల్లో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన కొనసాగుతున్న వారికి వేతనాలు పెండింగ్లో ఉన్న విషయం వాస్తవమే. మా శాఖలో చేపడుతున్న పలు కార్యక్రమాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. వేతనాల పెండింగ్పై ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదిక పంపాం. ప్రభుత్వం నుంచి బడ్జెట్ విడుదల కాగానే ఔట్సోర్సింగ్ ఏజెన్సీలకు బదిలీ చేసి, వేతనాలు అందజేసేలా చర్యలు తీసుకుంటాం.
– ఎం సరస్వతి, జిల్లా సంక్షేమాధికారి (కరీంనగర్)