ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ఎన్నికల నిర్వహణకు 8 పోలింగ్ కేంద్రాలు
ప్రతి కేంద్రంలో వెబ్కాస్టింగ్
కరీంనగర్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 10న జరిగే ఈ ఎన్నికల కోసం ఉమ్మడి జిల్లా పరిధిలో 8 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల ప్రతినిధులు ఓటర్లుగా ఉండే ఈ ఎన్నికల్లో ఎక్కువ మంది ఎంపీటీసీలే ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో కౌన్సిలర్లు ఉన్నారు. మొత్తం 1,324 ఓట్లు ఉన్న ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
స్థాని క సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 8 పో లింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రం పరిధిలో దగ్గరిలోని మండలాలకు చెందిన ఓటర్లు వచ్చి ఓటు వేసే విధంగా ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ జడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పో లింగ్ కేంద్రంలో కరీంనగర్, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్, మానకొండూర్, చొప్పదండి, రామడుగు, గంగాధర, తిమ్మాపూర్, గన్నేరువరం, చిగురుమామిడికి సంబంధించిన ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోవచ్చు.
హుజూరాబాద్ మండల ప్రజాపరిషత్లో ఏర్పా టు చేసిన పోలింగ్ కేంద్రంలో హుజూరాబాద్, సైదాపూర్, శంకరపట్నం, వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట హన్మకొండ జిల్లా పరిధిలోని కమలాపూర్, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.జగిత్యాల ఎంపీడీవో ఆఫీసులో ఏర్పాటు చేసిన కేంద్రంలో జగిత్యాల, జగిత్యాల రూరల్, రాయికల్, మల్యాల, కొడిమ్యాల, పెగడపల్లి, వెల్గటూర్, గొల్లపల్లి, ధర్మపురి, బుగ్గారం, బీర్పూర్, సారంగాపూర్ మండలాల ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. కోరుట్ల ఎంపీడీవో ఆఫీసులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మేడిపల్లి, కథలాపూర్ మండలాల ఓటర్లు ఓటు వేయొచ్చు.
పెద్దపల్లి ఎంపీడీవో ఆఫీసులో ఏర్పాటు చేసిన కేంద్రంలో పెద్దపల్లి, ఓదెల, సుల్తానాబాద్, జూలపల్లి, ఎలిగేడు, ధర్మారం, శ్రీరాంపూర్, రామగుండం, అంతర్గాం, పాలకుర్తి మండలాల ఓటర్లు తమ ఓటు హక్కును వినయోగించుకోవచ్చు. మంథని ఎంపీడీవో ఆఫీసులో ఏర్పాటు చేసిన కేంద్రంలో పెద్దపల్లి జిల్లా పరిధిలోని మంథని, కమాన్పూర్, రామగిరి, ముత్తారం (మంథని), జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని మహదేవపూర్, పలిమెల, కాటారం, మల్హర్రావ్, మహముత్తారం మండలాల ఓటర్లు ఓటు వేయొచ్చు. సిరిసిల్ల జడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేం ద్రంలో సిరిసిల్ల, తంగళ్లపల్లి, గంభీరావుపేట, వేములవాడ, వేములవాడ రూరల్, చందుర్తి, రు ద్రంగి, బోయినపల్లి, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్, ఇల్లంతకుంట, కోనరావుపేట మండలాల ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోవచ్చు.
హుస్నాబాద్లోని ఎంపీడీఓ ఆఫీసులో ఏర్పాటు చేసిన కేంద్రంలో హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు..
ఎన్నికల్లో పనిచేసే సిబ్బంది..
ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ప్రతి కేంద్రానికి నలుగురి చొప్పున 36 మంది పీవోలు, ఏపీవోలను ఏర్పాటు చేశారు. మైక్రో అబ్జర్వర్లుగా 12 మందిని నియమించారు. ఇక ప్రతి ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లతో ఎంసీసీ బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో కరీంనగర్లో 20, జగిత్యాలలో 23, పెద్దపల్లిలో 17, సిరిసిల్లలో 14, జయశంకర్ భూపాలపల్లిలో 5, హన్మకొండలో 3, సిద్దిపేటలో 5 చొప్పున మొత్తం 87 బృందాలను ఏర్పాటు చేశారు. వీరు కాకుండా జిల్లాకు ఒక ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, వీఎస్టీ బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
పకడ్బందీ బందోబస్తు
ఎన్నికల కోసం పోలీసులు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 1,113 మంది పోలీసుల సేవలను వినియోగించుకుంటున్నారు. ఇందులో ఏసీపీ/డీఎస్పీలు 10, సీఐలు 26, ఎస్ఐలు 54, ఏఎస్ఐ/హెడ్ కానిస్టేబుళ్లు 115, పోలీస్ కానిస్టేబుళ్లు 323, మహిళా పోలీసు/ మహిళా హోం గార్డులు 86, హెడ్ గార్డులు 134 మందితోపాటు క్యూర్టీ/డీజీలు 10 యూనిట్ల సేవలను ఈ ఎన్నికల్లో వినియోగిస్తున్నారు.