Siricilla | కలెక్టరేట్, జూన్ 30 : నిత్యవసర వస్తువులు, గ్యాస్ సిలిండర్లు, కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగినా మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వం చెల్లిస్తున్న మెనూ చార్జీలను పెంచకపోవడం వల్ల కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. మిడ్ డే మీల్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి మీసం లక్ష్మణ్ మాట్లాడుతూ ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.6.50, ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు రూ.10 మాత్రమే ప్రభుత్వం కేటాయిస్తోందని, ఈ మొత్తంతో రెండు కూరలు, నాణ్యమైన భోజనం అందించడం అసాధ్యమని వాపోయారు.
మార్కెట్లో వంటనూనె, పప్పులు, చింతపండు, టమాట, మిర్చి, ఇతర నిత్యావసర వస్తువులు, గ్యాస్ సిలిండర్ ధరలు విపరీతంగా పెరిగాయని, కానీ మెనూ చార్జీలు మాత్రం సంవత్సరాలుగా పెంచలేదని విమర్శించారు. బియ్యం తప్ప ఇతర సరుకులన్నీ కార్మికులే కొనాల్సి వస్తోందని, అప్పులు చేసి, ఆస్తులు అమ్ముకుని పథకాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10 వేల వేతనం ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు. సుప్రీంకోర్టు, హైకోర్టు సూచనల మేరకు స్కీమ్ వర్కర్లను రెగ్యులర్ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలుగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చకపోతే జులై 10 నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీల క్యాంపు కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మర్రి విజయ, బి. రెడ్డి లక్ష్మి, జ్యోతి, ఎండి జుబేదా, నర్సవ్వ, రేఖ, మహేశ్వరి, రజిత, లావణ్య, మమత, పోచమ్మ, కొమరవ్వ, సత్తవ్వ, లక్ష్మి, వరలక్ష్మి, రాజవ్వ తదితరులు పాల్గొన్నారు.