Dasari Mamata Reddy | పెద్దపల్లి, ఫిబ్రవరి5 : పెద్దపల్లిలో ఎమర్జెన్సీ పాలన నడుస్తుందా అని పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమతారెడ్డి అవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నించే బీఆర్ఎస్ నాయకులతో పాటు సామాన్య ప్రజలను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు భయబ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు. పెద్దపల్లి 11వ వార్డులో కొందరికీ బలవంతంగా కాంగ్రెస్ నాయకులు కండువా కప్పి కాంగ్రెస్ ఓటు వేయాలని బెదిరించటం ఎంతమేరకు సమంజసమని ప్రశ్నించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్దంగా పాలన సాగించిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్జన్యాలకు తెగబడుతుందని ఆరోపించారు. గురువారం 11వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి పూదరి లత – చంద్రశేఖర్, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆమె గడప గడపకు బీఆర్ఎస్ పార్టీ అనే నినాదంతో ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మేము మున్సిపల్ చైర్ పర్సనగా ఉన్నప్పుడే టీయూఎఫ్డీసీ నిధులు రూ. 200 కోట్ల దాకా మంజూరు కాగా, ఆ పనులకు పేర్లు మార్చి కొత్తగా నిధులు తీసుకోచ్చినట్లు స్థానిక ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్న మున్సిపాలిటీలకు కేంద్రం నిధులు మంజూరు చేస్తుందని చెప్పారు. పెద్దపల్లి పట్టణం మరింత అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు వైద శ్రీనివాస్, వైద సంజీవ్, ఆకుల నారాయణ, ఆకుల అనిల్, ఆకుల మారుతి, రమేశ్, కొండి రాజయ్య, కొండి కనకయ్య, వేముల రాజేశం, మల్లయ్య, మొనయ్య తదితరులు పాల్గొన్నారు.