ఇబ్రహీంపట్నం, నవంబర్ 22: ‘జాతీయ పార్టీలని చెప్పుకుంటూ, అదిచేస్తాం.. ఇది చేస్తామని ప్రజలను నమ్మబలికే బీజేపీ, కాంగ్రెస్లతో రాష్ర్టానికి చాలా ప్రమాదం. రాష్ట్రం అధోగతి పాలవుతుంది. అంధకారంలోకి వెళ్లిపోతుందని’ కోరుట్ల అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ 60 ఏండ్లు పాలించి చేసిందేమీ లేదని, తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని, ప్రస్తుత బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి రూపాయి పనైనా చేసిందా..? అని దుయ్యబట్టారు. ఇప్పుడిప్పుడే తెలంగాణ కుదుట పడుతున్నదని, మళ్లీ కాంగ్రెస్, బీజేపీ మోసపూరిత మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు. బుధవారం ఇబ్రహీంపట్నం మండలంలోని గోదూర్, వేములకుర్తి, తిమ్మాపూర్, తిమ్మాపూర్ తండా, యామాపూర్, ఫకీర్ కొండాపూర్ గ్రామాల్లో ప్ర చారం చేయగా, ఆయా గ్రామాల్లో నాయకులు, ప్రజలు, యాదవులు ఘన స్వాగతం పలికారు. గొర్రెపిల్లను బహూకరించి, సత్కరించారు.
ఆయా గ్రామాల్లో సంజయ్ మాట్లాడారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారన్నారు. మనం వేసే ఓటు మన భవిష్యత్తుతో పాటు మన పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుందన్నారు. ఆలోచించి పనిచేసే ప్రభుత్వాన్ని గుర్తించాలని కోరారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రైతులకు మూడు గంటల విద్యుత్ ఇస్తే సరిపోతుందని బాజాప్తా చెబుతున్నాడని, చాలుతదా..? మీరే ఆలోచించుకోవాని రైతులకు సూచించారు. మూడు గంటల కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ కావాలా..? 24 గంటలు కరెంటు ఇచ్చే సీఎం కేసీఆర్ కావాలా ఒక్కసారి ఆలోచించుకోవాలని సూచించారు. బీజేపీ నాయకులు కులాల, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారన్నారు. ఎంపీగా గెలిచిన అర్వింద్ ఈ ప్రాంతానికి ఏం చేశాడని ప్రశ్నించారు.
ఏ గ్రామంలోనైనా రూపాయి పనిచేశాడా..? చెప్పాలన్నారు. ఎన్నికలు వచ్చాయని కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాయమాటలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, నమ్మితే గోసపడుతారని సూచించారు. తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని, మీ అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పారు. ఈ ప్రాంత యువతకు ఉద్యోగవకాశాలు కల్పించేందుకు నియోజకవర్గంలో ఐటీ హబ్ ఏర్పాటు చేశానన్నారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటే, ఉద్యోగాల బాధ్యత తనదేనని పిలుపునిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ జాజాల బీమేశ్వరి, వైస్ఎంపీపీ లక్ష్మారెడ్డి, సర్పంచులు సోమ ప్రభాకర్, సున్నం నవ్యశ్రీ, నేరేళ్ల హేమలత, జున్ను బాయ్, తలారి మనిష, గుంటి లక్ష్మి, సింగిల్ విండో చైర్మన్ అంకతి రాజన్న, నాయకులు కంఠం రమేశ్, జాజాల జగన్రావు, దశరథ్రెడ్డి, నేమూరి సత్యనారాయణ, తీగల రాజేందర్రెడ్డి, చిన్నారెడ్డి, సుమన్, గణేష్, నరేష్, స్వామి, పురుషోత్తం, నేరేళ్ల దేవేందర్, ఆనంద్, డాక్టర్ పెంట లింబాద్రి, సత్యం, శివరాజం, గుంటి దేవయ్య, మహేశ్, జీవన్, రెబ్బటి రాజేందర్ పాల్గొన్నారు.