కలెక్టరేట్, జనవరి 6: హైదరాబాద్ నుంచి కరీంనగర్లోని ఈవీఎం గోదాంకు చేరుకున్న ఎన్నికల సామగ్రిని నిశితంగా పరిశీలించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్లోని ఈవీఎం గోదాంకు చేరుకున్న ఎన్నికల సామగ్రిని శుక్రవారం ఆయన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాకు చేరుకున్న ఎన్నికల సామగ్రిని డంప్ చేసిన అనంతరం సానింగ్ చేసి వివరాలను నమోదు చేసుకున్న పిదపనే గోదాంలో భద్రపరచాలని సూచించారు. ఎన్నికల సామగ్రికి పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయా పార్టీల నాయకుల సమక్షంలో ఎన్నికల సామగ్రిని భద్రపరిచారు. అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్, ఆర్డీవో ఆనంద్ కుమార్, ఎంఐఎం ప్రతినిధి అఖిల్, బీఆర్ఎస్ ప్రతినిధి సాయిని శ్రీనివాస్, బీజేపీ ప్రతినిధి రమణారెడ్డి, సీపీఎం ప్రతినిధి వాసుదేవ రెడ్డి, కాంగ్రెస్ ప్రతినిధి మోహన్ చారి, సీపీఐ ప్రతినిధి సురేశ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.