కార్పొరేషన్, ఫిబ్రవరి 3: నగరపాలక సంస్థలో పని చేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మేయర్ వై సునీల్రావు పేర్కొన్నారు. బల్దియా ట్రాక్టర్, స్వచ్ఛ ఆటో డ్రైవర్ల సంఘం నూతన కమిటీని గురువారం ఎన్నుకున్నారు. అనంతరం కమిటీ సభ్యులు భగత్నగర్లోని క్యాంపు కార్యాలయంలో మేయర్ వై సునీల్రావును మర్యాదపూర్వకంగా కలిశారు. మేయర్ను శాలువాతో సన్మానించారు. ట్రాక్టర్, స్వచ్ఛ ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని సంఘం నాయకులు కోరారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా మున్సిపల్ పాలకవర్గం పనిచేస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రాక్టర్, స్వచ్ఛ ఆటో డ్రైవర్ల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు ఎల్ రూప్సింగ్, టీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్రెడ్డి, సంఘం అధ్యక్షుడు పొన్నం లింగయ్య, ఉపాధ్యక్షుడు కోనేటి సమ్మయ్య, కోశాధికారి సుంకరి లక్ష్మణ్, నగరపాలక సంస్థ పారిశుధ్య కార్మికుల సంక్షేమ సంఘం నాయకులు గడ్డం సంపత్, దావు రాజమల్లయ్య, శ్రీనివాస్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి
బల్దియా కాంట్రాక్ట్ కార్మికులకు భద్రత కల్పించాలని 3వ డివిజన్ కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో మేయర్ వై సునీల్రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరపాలక సంస్థలో పని చేస్తున్న వెయ్యి మంది పారిశుధ్య కార్మికులు నగర పరిధిలో రోడ్లను ఊడ్చే క్రమంలో ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. దీంతో వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని విన్నవించారు. ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబానికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి తీవ్రతను బట్టి రూ. 3 లక్షల వరకు ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, కార్మికులకు నగర పాలక సంస్థ నుంచి జీవిత బీమా, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ విషయాన్ని బల్దియా సర్వసభ్య సమావేశ ఎజెండాలో చేర్చాలని విన్నవించారు.