Karimnagar | కమాన్ చౌరస్తా, ఏప్రిల్ 11 : విద్యార్థులను అభ్యాస ప్రక్రియలో కేంద్రంగా ఉంచుతూ, అద్విత ఇంటర్నేషనల్ స్కూల్లో “ఎకోస్ ఆఫ్ ట్రైబ్స్” అనే థీమ్తో హెరిటేజ్ క్లబ్ ప్రత్యేక కార్యక్రమం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని లోయర్ సెకండరీ, హైస్కూల్ విద్యార్థులు ముందుండి నిర్వహించారు. విద్యార్థులు స్వయంగా బాధ్యతలు తీసుకుని వివిధ గిరిజన సంస్కృతులను ఆకర్షణీయ ప్రదర్శనలు, పరిశోధన ఆధారిత ప్రెజెంటేషన్లు, కళాత్మక ఆవిష్కరణల ద్వారా అందించారు.
ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ అనుదీప్ సౌగాని మాట్లాడుతూ, ఇలాంటి వేదికలు విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచనను పెంపొందించడంతో పాటు ప్రపంచ అవగాహన, సాంస్కృతిక వైవిధ్యంపై గౌరవాన్ని పెంచుతాయని అభిప్రాయపడ్డారు. ప్రిన్సిపాల్ మాధురి శ్వేత, వైస్ ప్రిన్సిపాల్ దివ్య ఎం మాట్లాడుతూ, ఈ కార్యక్రమం అనుభవాత్మక అభ్యాసానికి అద్భుత ఉదాహరణగా నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన క్లబ్ ఇన్చార్జ్లు, గ్లోబల్ పర్స్పెక్టివ్ ఫెసిలిటేటర్ నితీష, హ్యూమానిటీస్ ఫెసిలిటేటర్ ప్రణవ్లను ప్రత్యేకంగా అభినందించారు.