ఎన్నడూ లేని విధంగా ఈ సారి సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. నిరుడు గళగళపారిన ఎస్సారెస్పీ కాలువలు ఈ యేడు వెలవెలబోతున్నాయి. చివరి దశలో ఉన్న పంటను కాపాడేందుకు రైతులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వెరసీ మంథని డివిజన్లోని గోదావరి, మానేరు పరీవాహక ప్రాంతాల్లోని వేల ఎకరాల్లో నెర్రెలు బారిన పంట పొలాలు బర్రెలకు మేతగా మారుతున్నాయి.
మంథని, ఏప్రిల్ 1: మంథని డివిజన్లోని మంథని మండలం పుట్టపాక, చల్లపల్లి, మైదుపల్లి, కాకర్లపల్లి, సూరయ్యపల్లి, ఖానాపూర్, ఎక్లాస్పూర్, మంథని శివారు, మల్లేపల్లి, విలోచవరం, నాగారం, అక్కెపల్లి, సిద్ధపల్లి, ముత్తారం మండలంలోని సీతంపల్లి, రామకృష్ణాపూర్, రంగయ్యపల్లి, ఖమ్మంపల్లి, రామగిరి మండలంలోని రాజాపూర్, రామయ్యపల్లి, లద్నాపూర్, బేగంపేటతో పాటు పలు టేలాండ్ ప్రాంతాల్లోని రైతులు ఎస్సారెస్పీ డీ-83 కెనాల్, సబ్ కెనాళ్లపై ఆశలు పెట్టుకొని వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. అయితే ప్రారంభంలో రెండు తడులు మాత్రమే సాగునీరందించారు.
కానీ, తర్వాత నీరివ్వక పోవడంతో సాగునీటి సమస్య మొదలైంది. మరోవైపు గోదావరి, మానేరు నదుల్లో నీటి ప్రవాహం లేక భూగర్భజలాలు గణనీయంగా పడి పోయాయి. చెరువులు, కుంటలు సైతం అడుగంటుతున్నాయి. గతానికి భిన్నంగా ఈ సారి కష్టాలు మొదలయ్యాయి. దీనికితోడు కరెంట్ ఇక్కట్లు వెంటాడుతున్నాయి. దీంతో వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. చేతికొచ్చే దశలో దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
పెట్టుబడి వచ్చే దిక్కు లేక మనోవేదనకు గురవుతున్నారు. దిక్కుతోచని స్థితిలో దుఃఖాన్ని దిగమింగుకొని పొలాల్లో పశువులను తొలుతున్నారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు తలెత్తలేదని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు అనాలోచిత విధానాలతోనే ఈ దుస్థితి దాపురించిందని భగ్గుమంటున్నారు. ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
నేను మా ఊరి చెరువు కింద ఐదెకరాల్లో వరి వేసిన. అందులో రెండెకరాలు కౌలుకు తీసుకున్న. అధికారులు నీరిస్తమంటేనే ధైర్యంగా పెట్టుబడి పెట్టి పంట సాగు చేసిన. మొదట రెండుసార్లు ఇచ్చిన్రు. కొన్ని రోజుల్లోనే పంట చేతికత్తదని సంబుర పడ్డ. తీరా పంటలు చేతికి అచ్చే టైమ్లో నీళ్లు ఆపివేసిన్రు. సార్లకు మొరపెట్టుకున్న పట్టించుకోలె. దీంతో పంటలు ఎండి పోతున్నయ్. చేసేది ఏమి లేక ఐదు ఎకరాల్లో వరి పంట ఎండి పోయింది. దిక్కులేక పొలంలో పశువులను మేపుకుంటున్న.
-రాచర్ల రమేశ్, రైతు (పుట్టపాక)
నేను మా ఊరి చెరువు కింద మూడెకరాల్లో వరి వేసిన. కెనాల్ నీళ్లు రాక దాదాపు నెల రోజులైతంది. దీంతో రెండెకరాల్లో పంట ఎండిపోయింది. ఎకరాకు రూ. 25వేలకు పైగా పెట్టుబడి పెట్టిన. అవన్నీ నీళ్ల పాలైనట్లే. కడుపు మండిన రైతులు ఎండిన పంటను చూడలేక బాధతో పశువులకు వదిలి పెడుతున్నరు. నేను రూ. లక్ష వరకు లాస్ అయినట్లే. తొమ్మిదేండ్లుగా మేము నీళ్ల కోసం, కరెంట్ కోసమైతే ఎదురు చూడలే, ఏ నీటైమ్ నీళ్లచ్చేది మాకు, బాధన్న ముచ్చటే లేకుండే. కానీ ఈ ఏడాదే మాత్రం నీళ్ల గోస అచ్చిపడింది.
-సవాయి నాని, సల్లపల్లి (పుట్టపాక)
పుట్టపాక-శ్రీరాంనగర్ గ్రామాల మధ్య సాగునీరు లేక వందల ఎకరాల్లో వరి పంటలు ఎండిపోయినయ్. దీంతో రైతులు పశువులను మేపుకొమ్మని చెప్పిన్రు. అయితే రైతులు కన్న బిడ్డల్లాగా పెంచుకున్న పొలాలను మేత కోసం వదిలి పెడుతున్న తీరు చూసి నాకు కూడా బాధేసింది. నేను కూడా రైతునే. రెండు ఎకరాల్లో సాగు చేసిన. గొలుసు వేసిన ఈ టైమ్లో కాలువ నీళ్లు రాక పంట పూర్తిగా ఎండి పోయింది. దాదాపు లక్షకు పైగా పెట్టుబడి, చేతి కష్టం పోయినట్లే. చివరికి రైతుల పొలాలతో పాటు నా ఎండిన పొలంలో కూడా నా మేకలను మేపుతున్న. సర్కారు పరిహారమిచ్చి ఆదుకోవాలె.
-సలీం, మేకల కాపరి (పుట్టపాక)