కరీం‘నగరానికి’ జలగండం పొంచి ఉన్నది. నీటి కటకట తీవ్ర స్థాయికి చేరుతున్నది. మూడేండ్లలో ఎన్నడూ లేనివిధంగా ఫిబ్రవరిలోనే నుంచే పలు డివిజన్లలో కొరత ఏర్పడగా, నగర ప్రజానీకం ఇబ్బందులు పడుతున్నది. నగరానికి నీరందించేందుకు ఎల్ఎండీ రిజర్వాయరే ఆధారం కాగా, రోజురోజుకూ నీటి నిల్వలు తగ్గుముఖం పడుతుండడంతో సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది. దీంతో పలు డివిజన్లలోని కాలనీల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సిన పరిస్థితి దాపురించింది. మరోవైపు నగరంలో మంచినీటి పైపులైన్ల లీకేజీలు, నీటి సరఫరా నిర్వహణపై ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వచ్చే కొద్దిపాటి నీటికి బ్రేక్ పడుతున్నది. ఇప్పుడే ఇలా ఉంటే మండు వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయం నగరవాసుల్లో వ్యక్తమవుతున్నది.
Drinking Water | కరీంనగర్ కార్పొరేషన్, మార్చి 28 : ఇంకా ఎండలు ముదరనే లేదు, కానీ, అంతట నీటి సమస్య మొదలవుతున్నది. కరీంనగర్లో ఇప్పటికే ప్రజల గొంతెండిపోతున్నది. నాలుగైదేండ్లుగా లేని నీటి సమస్య మళ్లీ ఇబ్బంది పెడుతున్నది. వాస్తవానికి కరీంనగరంలో ఒకప్పుడు నీటి కటకట తీవ్రంగా ఉండేది. ఎండకాలం వచ్చిందంటే చాలు ప్రజలు చాలా ఇబ్బంది పడేవారు. కానీ, కేసీఆర్ సర్కారు వచ్చిన తర్వాత ఈ సమస్య పరిష్కారమైంది. రూ.కోట్లాది నిధులతో పనులు చేపట్టి, ప్రతి రోజూ మంచినీటిని సరఫరా చేయించింది. ఎల్ఎండీలో నీటి మట్టం తగ్గినప్పుడు ఎగువన గల శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి నీటిని విడుదల చేసి మరీ ఇబ్బందులు రాకుండా చూసింది.
కానీ, ప్రస్తుతం సీన్ మారిపోయింది. ఎల్ఎండీ రిజర్వాయర్లో రోజు రోజుకూ నీటి నిల్వలు తగ్గుముఖం పడుతుండడంతో నగరంలో నీటి సరఫరా విషయంలో ఇబ్బందులు వస్తున్నాయి. ఫిబ్రవరి వరకు ప్రతి రోజూ మంచినీటి సరఫరా చేసిన అధికారులు, ఈ నెల మొదటి వారం నుంచే హైలెవల్ జోన్ పరిధిలోని ఆరు డివిజన్లలో రోజు విడిచి రోజు అందించారు. ఇక వారం రోజులుగా నగర వ్యాప్తంగా రోజు విడిచి రోజు సరఫరా చేస్తుండగా, ప్రజలు నీటి సంపులు, ట్యాంకులను వినియోగించే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ఎల్ఎండీలో 5 టీఎంసీలకు పైగా నీరు ఉండగా.. నడి ఎండల వరకు నీటి సామర్థ్యం తగ్గే ప్రమాదమున్నది. ఈ పరిస్థితుల్లో తాగునీటి సరఫరాకు మరిన్ని ఇబ్బందులు వచ్చే ముప్పు కనిపిస్తున్నది.
నగరంలో అసలే రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేస్తుండగా, పైపులైన్ల లీకేజీ సమస్య వేధిస్తున్నది. దీంతో వచ్చే కొద్దిపాటి నీరు వృథాగా పోతున్నదని, వెంటనే మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇంజినీరింగ్ ఉన్నతాధికారుల క్షేత్రస్థాయి పర్యవేక్షణలేకపోవడం, పూర్తిగా ఫిట్టర్, లైన్మెన్లపైనే ఆధారపడడం వల్లే ఈ సమస్య ఎక్కువైందని విమర్శిస్తున్నారు. ఇంకా నగరంలోని పలు ప్రాంతాలకు సరిపడా సరఫరా వస్తుండడం, మరికొన్ని ప్రాంతాలకు అంతంతమాత్రమే సరఫరా అవుతుండడం విమర్శలకు తావిస్తున్నది. స్వయంగా పలువురు పాలకవర్గ సభ్యులే దీనిపై మండిపడుతున్నారు. ఈ వేసవిలోనైనా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తే నీటి కష్టాలు కొంత వరకైనా తీరుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఫిల్టర్ బెడ్లో 63 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ ఫర్ డే) శుద్ధి చేసే సామర్థ్యం ఉంది. ప్రస్తుతం ఎల్ఎండీలో 5 టీఎంసీల నీరు మాత్రమే ఉండడంతో రా వాటర్ తీసుకోవడానికి బూస్టర్ పంపులను వినియోగిస్తుండగా, 50 నుంచి 52 ఎంఎల్డీలు మాత్రమే వస్తున్నది. ఆ నీటినే ఫిల్టర్ చేసి నగరానికి సరఫరా చేస్తున్నారు. నగరానికి మంచినీటిని అందించే ఫిల్టర్ బెడ్లోకి సరిపడా నీరు అందడం లేదని బల్దియా ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. అయితే, ఫిల్టర్ బెడ్కు సరిపడా నీరందకపోవడంతో హై లెవల్ జోన్లో ఒక రోజు, లో లెవల్ జోన్లో మరొక రోజు సరఫరా చేస్తున్నారు. ఎల్ఎండీలో మరింత నీటి మట్టం తగ్గితే వచ్చే రా వాటర్లో మలినాలు ఎక్కువగా ఉండే ముప్పు ఉందని, దీనిని ఫిల్టర్, పంపింగ్ చేసేందుకు ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు.