జగిత్యాల కలెక్టరేట్, నవంబర్ 27: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, కాంగ్రెస్లది బాండ్ బంధమని, అరవింద్ డైరెక్షన్లో జీవన్రెడ్డి యాక్షన్ చేస్తున్నాడని జగిత్యాల అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ విమర్శించారు. జగిత్యాల పట్టణం మోతె రోడ్డులోని బీఆర్ఎస్ కార్యాలయంలో జగిత్యాల అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పసుపు బోర్డు తెస్తానని ఎంపీ ఎలక్షన్లలో ధర్మపురి అర్వింద్ బాండ్ పేపర్ రాసిచ్చి మాట తప్పినట్లే, నేడు జీవన్రెడ్డి బాండ్ పేపర్ విధానం కూడా ఉంటుందన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తానని జీవన్రెడ్డి బాండ్ పేపర్ రాసివ్వడంతో కాంగ్రెస్ మేనిఫెస్టో, గతంలో ఇచ్చిన హామీలన్నీ ఉత్తవేనని దేవుడి ముందు ఉంచి ఒప్పుకున్నట్లేనన్నారు.
అసలు జీవన్రెడ్డి మాటలు ఎవరూ నమ్మడం లేదనే, ఈ బాండ్ పేపర్ నాటకాన్ని మొదలు పెట్టాడన్నారు. జీవన్రెడ్డి రాసిచ్చిన బాండ్ పేపర్ విలువ ఎంతంటే, ఆయన అల్లుడు ధర్మపురి అర్వింద్ పసుపు బోర్డుపై రాసిచ్చిన బాండ్ పేపర్తో సమానమన్నారు. బాండ్ పేపర్లతో అంకుల్(జీవన్రెడ్డి), అల్ల్లుడు(అరవింద్) నాటకాలు ఆడుతున్నారన్నారు. 40ఏండ్ల రాజకీయ జీవితంలో జీవన్రెడ్డి జగిత్యాలకు చేసిందేమీలేకపోగా, ప్రతి పనికి అడ్డుపడుతూ అభివృద్ధి నిరోధకుడిగా మారాడని మండిపడ్డారు. అభివృద్ధికి అడ్డుపడటమే కాకుండా జీవన్రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఎలాగైనా గెలువాలని రోజురోజుకు దిగజారుతున్నాడన్నారు. జీవన్రెడ్డి తన చవకబారు మాట లు, చేష్టల వల్ల తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నాడని విమర్శించారు.
జగిత్యాలకు అన్నీ ఆయనే తెచ్చానని, రాజీవ్ రహదారి ఆయనే వేయించానని జీవన్రెడ్డి చెబుతున్నాడని, నాలుగు లైన్ల రాజీవ్ రహదారి జగిత్యాలకు కాకుండా రామగుండం ఎందుకు పోయిందో జీవన్రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. జగిత్యాలలో మెడికల్ కళాశాల స్థలం, యావర్ రోడ్డు వెడల్పు, పాత బస్టాండ్ నుంచి గొల్లపెల్లి వైపు రోడ్డు వెడల్పు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీల వంటి ప్రతి పనికి అడ్డుపడ్డాడని, అయినప్పటీకీ వాటిని పూర్తి చేశామన్నారు. మున్సిపల్ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్పై శివారు గ్రామాల ప్రజల మెదల్లలో విషం నింపి వారిని రెచ్చగొట్టాడన్నారు. డ్రాఫ్ట్ ప్లాన్ను రద్దు చేశామని ప్రకటించామని, మాస్టర్ ప్లాన్ను జగిత్యాల మున్సిపల్ పరిధికే వర్తింపచేస్తామని క్లియర్గా చెప్పామని, కనీసం జగిత్యాల రెవెన్యూ పరిధి అని కూడా రద్దు కాపీలో పేర్కొనలేదని, అయినప్పటికీ జీవన్రెడ్డి అదే దుష్ప్రచారం చేస్తూ చిల్లర రాజకీయం చేస్తున్నాడని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పాలన వల్లే పేదరికం పెరిగిందని, సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణలోని తొమ్మిది జిల్లాలను కేంద్రం వెనుకబడిన జిల్లాలుగా ప్రకటించడమే పేదరికానికి నిదర్శనమన్నారు. మాట్లాడితే మిగులు బడ్జెట్ రాష్ర్టాన్ని అప్పుల రాష్ట్రం గా మార్చిండ్రని మాట్లాడే జీవన్రెడ్డి, వెనుకబడిన రాష్ట్రం మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఎలా ఉంటుందో చెప్పాలన్నారు. దశాబ్దాలుగా జగిత్యాలలో జరుగని పనులు చేశాననే సంతృప్తి తనకు ఉందని, అసలు జీవన్రెడ్డి జగిత్యాలకు ఏం చేశాడో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో 2004 నుంచి 2014 వరకు ఎన్ని ఉద్యోగాలిచ్చిండ్రో చెప్పాలన్నారు. జగిత్యాలను వెయ్యి కోట్లతో అభివృద్ధి చేశామని, సంక్షేమం కింద నే రూ.350కోట్లు చెల్లించామని చెప్పిన సంజయ్, 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పదికోట్లు కూడా సంక్షేమానికి ఖర్చుపెట్టలేదన్నారు.
వడ్ల కొనుగోళ్లపై ఢిల్లీలో, గల్లీలో ధర్నాలు చేశామని, రైతునని చెప్పుకునే జీవన్రెడ్డి మరి అప్పుడెక్కడున్నడు..? ఎందుకు ధర్నాకు దిగలేదని, ధాన్యం కోత విషయంలో రైస్ మిల్లుల వద్ద ధర్నా చేద్దామంటే పత్తాలేకుండా పోయాడని దుయ్యబట్టారు. నూకల ఎగుమతిపై విధించిన నిషేదాన్ని కేంద్రప్రభుత్వం ఎత్తివేయాలని, లేదంటే కేంద్రప్రభుత్వమే పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. జగిత్యాల జిల్లా, జగిత్యాల ని యోజకవర్గాన్ని విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, విద్యు త్, తాగుసాగునీరు, మౌళిక సదుపాయాల కల్పన ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. స్వచ్ఛ భారత్లో జగిత్యాల జిల్లా దేశంలోని 750 జిల్లాల్లో నంబర్ 2గా నిలిచిందన్నారు.
పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేందుకు బీసీ, ఎస్సీ స్టడీ సర్కిల్, మెడికల్ కళాశాలలను పాత పది జిల్లాల తర్వాత ఏర్పాటు చేసుకున్నది కేవలం జగిత్యాల జిల్లాలో మాత్రమేనని స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన రాష్ట్రం, జిల్లా ఏది అని..? నేడు గూగుల్లో వెతికితే తెలంగాణ, జగిత్యాల జిల్లాలు కనపడుతాయన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వస్తే రాష్ట్రం, జగిత్యాల తిరోగమనమే కానీ పురోభివృద్ధి ఉండదన్నారు. రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జగిత్యాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని నిర్మిస్తానని, కొత్తగా నిర్మాణమవుతున్న కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీలకు ప్రాధాన్యత ఇస్తానని, యావర్ రో డ్డు విస్తరణ చేపడుతామన్నారు. వ్యవసాయాధిరిత జిల్లా కనుక వ్యవసాయానుబంధ పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తానన్నారు. ఇక్కడ ల్రైబ్రరీ చైర్మన్ చంద్రశేఖర్గౌడ్, బీఆర్ఎస్ నాయకులు గంగరాజం, మహేశ్వర్రావు, శ్రీనివాస్, సురేందర్నాయ క్, గిరి, అంజనేయులు, రాజేందర్, ప్రణయ్, శ్రీకాంత్ ఉన్నారు.