కరీంనగర్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): ‘ఒమిక్రాన్ వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలి.. అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి’ అని అధికారులను మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్లో కొవిడ్, ఒమిక్రాన్పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో 2019 మార్చిలో కరోనా పాజిటివ్ కేసులు 10 నమోదుకాగా ధైర్యంగా ఎదురొన్నామన్నారు. కేసులు పెరుగకుండా కట్టడి చేశామని చెప్పారు. కరోనా మొదటి డోస్ వ్యాక్సినేషన్లో 103 శాతం, రెండో డోస్ వ్యాక్సినేషన్లో 94 శాతంతో జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలువడం సంతోషకరమన్నారు. కృషి చేసిన యంత్రాంగాన్ని, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని అభినందించారు. 15 నుంచి 18 ఏండ్ల వారిలో ఇప్పటికే 50 శాతం టీకా పంపిణీ పూర్తి చేశామని తెలిపారు. ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, 60 ఏళ్లు పైబడిన వ్యాధిగ్రస్తులకు బూస్టర్ డోస్ను సోమవారం ప్రారంభించామని తెలిపారు. ఒమిక్రాన్ నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు.
ఈ నెల 20 వరకు ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దని, గుంపులుగా తిరగవద్దన్నారు. పారిశుధ్యంపై బల్దియా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో సున్నా కరోనా కేసులు ఉన్నాయన్నారు. ఒమిక్రాన్ను ఎదురొనేందుకు జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్లు సిద్ధంగా ఉంచాలని, హెల్ప్ డెస్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొవిడ్ బాధిత గర్భిణులకు మాతా శిశు సంరక్షణ కేంద్రంలో చికిత్స కోసం ఏర్పాట్లు చేశామని చెప్పారు. ప్రస్తుతం జిల్లాలోని 3 ప్రైవేట్ దవాఖానల్లో ముగ్గురు కరోనా పేషెంట్లు ఉన్నారని, వీరికి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. రెండు నెలల నుంచి జిల్లాలో కరోనా కేసులు, మరణాలు లేవని తెలిపారు. ఈ నెల 13 న వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో ఆలయాల్లో శానిటైజేషన్ చేయించాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ మానకొండూర్ మండలం లక్ష్మీపూర్ పీహెచ్సీ శిథిలావస్థకు చేరిందని, కొత్త భవనం నిర్మించాలని కలెక్టర్ను కోరారు. ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ మాట్లాడుతూ వైద్యులు సత్వర సేవలందించాలన్నారు. జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ మాట్లాడుతూ కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె కోరారు.
ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ కరోనాపై ప్రజలు ప్రభుత్వ దవాఖానకు ఫోన్ చేసినప్పుడు తగిన సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలెటర్లు, పడకలు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాయన్నారు. హుజూరాబాద్, జమ్మికుంట పీహెచ్సీల్లో అన్ని సిద్ధంగా ఉంచామన్నారు. ప్రభుత్వ దవాఖానలో పిల్లల వైద్యులు అందుబాటులో ఉన్నారన్నారు. సీపీ సత్యనారయణ మాట్లాడుతూ కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక్కడ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవీందర్రెడ్డి, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, అదనపు కలెక్టర్లు జీవీ శ్యాం ప్రసాద్లాల్, గరిమా అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, ఆర్డీవో ఆనంద్ కుమార్, బల్దియా కమిషనర్ సేవాఇస్లావత్, డీఎంహెచ్వో జువేరియా, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
వైద్య సిబ్బంది సేవలు మరువలేనివి
కరోన బాధితులకు వైద్య, ఆరోగ్య సిబ్బంది ప్రాణాలకు తెగించి అందిస్తున్న సేవలు వెలకట్టలేవని మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. కొత్తపల్లి మండల ప్రాథమిక ఆరో గ్య కేంద్రంలో వైద్య ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ సిబ్బందికి బూస్టర్ డోస్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో ముందుజాగ్రత్తగా కొవిడ్ టీకా బూస్టర్ డోస్లను సోమవారం నుంచి ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. రెండు డోసుల వాక్సిన్ తీసుకొని 9 నెలలు పూర్తయిన వారు బూస్టర్ డోస్కు అర్హులని చెప్పారు. ప్రస్తుతం వైద్య, ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ సిబ్బంది, 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్ ఇస్తున్నామన్నారు. ఎలాంటి వ్యా ధులు లేని 60 ఏండ్లు పై బడిన వారికి వచ్చే నెల నుంచి బూస్టర్ డోస్ అందిస్తామని పేర్కొన్నారు. కరోనా బారిన పడకుండా ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచించారు. 15 నుంచి 18 ఏండ్ల వయసు వారు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు డిప్యూటీ డీఎంహెచ్వో సుధాకర్రెడ్డి, పీహెచ్సీ వైద్యులు రమేశ్, వంశీ ఉన్నారు.