కరీంనగర్ కార్పొరేషన్, జనవరి 27 : ట్రెడ్ లైసెన్స్ అంటే చట్టపరమైన లేదా అధికారిక పత్రం. దీంతో వ్యాపారానికి ఒక గుర్తింపు వస్తుంది. ఈ లైసెన్స్ తీసుకుంటే ప్రభుత్వాలు, వివిధ సంస్థల నుంచి అనేక ప్రయోజనాలు పొందే అవకాశమున్నది. షాపుల పేరిట ట్రేడ్ లైసెన్స్ నంబర్తో ఐటీ రిటర్న్ దాఖలు చేస్తే ప్రభుత్వం నుంచే కాకుండా బ్యాంకుల నుంచీ రుణాలు పొందేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. వీటితోపాటు ట్రేడ్ లైసెన్స్ పేరిట వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. కార్పొరేట్ సంస్థలతోనూ ఒప్పందాలు చేసుకోవచ్చు. ఆన్లైన్లోనూ తమ బిజినెస్ను చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని ఉంటే ఏదైనా ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో నష్టపరిహారం పొందవచ్చు. కాగా, ప్రస్తుతం ట్రేడ్ లైసెన్స్ పర్మినెంట్ కింద తీసుకుంటే ఏటా రెన్యువల్ మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. తాత్కాలికంగా తీసుకుంటే మాత్రం ఏటా లైసెన్స్ కొత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రతిసారీ అన్ని పత్రాలను సమర్పించాల్సి వస్తుంది.
లైసెన్స్ పొందడం ఇలా
గతంలో ట్రెడ్ లైసెన్స్ పొందాలంటే దుకాణం యజమాని ఆధార్ కార్డుతోపాటు ఇంటి, నల్లా పన్నుల చెల్లింపు రసీదులు, అద్దె ఒప్పంద పత్రంతో బల్దియాల్లో దరఖాస్తు చేసుకునేవారు. అప్పుడు అధికారులు పరిశీలించి మంజూరు చేసేవారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రక్రియను మరింత సులువు చేసింది. పారదర్శకత కోసం మున్సిపాలిటీల్లో సేవలను ఆన్లైన్ చేసింది. ఆధార్ నంబర్, అద్దె ఒప్పందం పత్రంతో ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే, పదిహేను రోజుల్లో ట్రెడ్ లైసెన్స్ వస్తుంది. కాగా, ప్రస్తుతం కరీంనగర్ నగరపాలక సంస్థలో చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో భాగంగా సిబ్బంది ఆయా షాపులు, దుకాణదారుల వద్దకు వెళ్లి బల్దియా నుంచి రూపొందించిన అద్దె ఒప్పందపత్రం నమూనాను అందించి, వివరాలను తీసుకొని ట్రెడ్ లైసెన్స్లను జారీ చేస్తున్నారు. దీని వల్ల దుకాణయజమాని మున్సిపాలిటీ చుట్టు తిరగకుండా రెండు రోజుల్లోనే లైసెన్స్ ఇస్తున్నారు.
పెరుగనున్న ఆదాయం
ప్రస్తుతం కొత్తగా ట్రేడ్ లైసెన్సులు మంజూరు చేస్తున్న అధికారులు, ఇప్పటి నుంచే రెన్యువల్పైనా దృష్టి సారించారు. ఏటా ఆయా వ్యాపారుల నుంచి రెన్యువల్ ఫీజులను వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు. మేయర్ ఆదేశాల మేరకు అన్ని ఏరియాల్లోనూ వచ్చే ట్రేడ్ లైసెన్సు ఫీజుల విషయంలో పూర్తిస్థాయిలో ఓ జాబితా రూపొందించి, ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం నగరపాలక సంస్థకు లైసెన్సుల ద్వారా ఏటా 8 లక్షల వరకు ఆదాయం వస్తుండగా, ఈ సారి 20 లక్షలకు పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
వ్యాపార సంస్థలకు ఎంతో ఉపయోగం
నగరపాలక సంస్థ పరిధిలోని వాణిజ్య, వ్యాపార సంస్థలన్నీ కూడా ట్రెడ్ లైసెన్స్ తీసుకోవడం వల్ల వ్యాపారులకు ఎంతో ఉపయోగముంటుంది. గతంలో ఆయా సంస్థల వారీగా మున్సిపాలిటీలు ఫీజులు నిర్ణయించి వసూళ్లు చేసేవి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్లోనే ఆయా వ్యాపార సంస్థల స్థల కొలతల మేరకు ఫీజులు వసూళ్లు చేసే విధంగా అభివృద్ధి చేశారు. ఈ పద్ధతిలోనే ప్రస్తుతం ట్రెడ్ లైసెన్స్ను మంజూరు చేస్తున్నారు. ప్రస్తుతం చేపట్టిన స్పెషల్ డ్రైవ్ మూలంగా లైసెన్స్ సంఖ్య కూడా పెరుగుతున్నది. ఇది నిరంతరం కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి వ్యాపారి కూడా ట్రెడ్ లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– స్వరూపరాణి, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్
కరీంనగర్లో మేయర్ ప్రత్యేక దృష్టి
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో వేల సంఖ్యలో షాపులు, దుకాణాలు ఉన్నా గతంలో కేవలం రెండు వేల వరకు మాత్రమే ట్రేడ్ లైసెన్సులు ఉండేవి. ఏటా ట్రేడ్ లైసెన్సులను జారీ చేసి ఆదాయం పెంచాలని నగరపాలక సంస్థ ఆలోచనలు చేయడం తప్ప సాధించిందేమీ లేకుండా పోయింది. మరో వైపు నగరంలో ఇబ్బడిముబ్బడిగా దుకాణాలు, భారీ షాపులు వెలుస్తున్నా, వీటి నుంచి లైసెన్స్ ఫీజుల వసూలు విషయంలో మాత్రం నిర్లక్ష్యం కొనసాగింది. కాగా, ఇటీవల మేయర్ వై సునీల్రావు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం నగరంలో 24 వేలకు పైగానే కమర్షియల్ విద్యుత్ కనెక్షన్లు ఉండగా, ఆ మేర ట్రేడ్ లైసెన్సులు లేకపోవడంపై అధికారులను నిలదీశారు. ఆ స్థాయిలోనే ట్రేడ్ లైసెన్సులు జారీ కావాలని, ఆ మేరకు ఆదాయం రావాలని లక్ష్యంగా నిర్ణయించారు. దీంతో నగరపాలక సంస్థ అధికారులు ట్రేడ్ లైసెన్సుల జారీకి పది రోజులుగా స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. అందుకోసం 15 బృందాలను ఏర్పాటు చేశారు.
ట్రేడ్ లైసెన్సుల సంఖ్య నాలుగింతలు
నగరపాలక సంస్థ చేపట్టిన స్పెషల్ డ్రైవ్ సత్ఫలితాలనిస్తున్నది. ప్రత్యేక బృందాలు ప్రతి డివిజన్లోనూ పర్యటించి, చిన్న షాపు నుంచి పెద్ద షాపు వరకు ట్రేడ్ లైసెన్స్ జారీ చేసే ప్రక్రియను చేపట్టాయి. గతంలో 2,145 మాత్రమే ట్రేడ్ లైసెన్సులు ఉండగా, ప్రస్తుతం దీనికి నాలుగింతలు లైసెన్సులు పెరిగినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఇప్పటికే 10 వేలకుపైగా లైసెన్సులు వచ్చాయి. మరో వారం రోజుల వరకు ఈ డ్రైవ్ కొనసాగనుండగా, అప్పటి వరకు ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఈ లైసెన్సులు తీసుకునేందుకు ఆయా వ్యాపార, వాణిజ్య, దుకాణాదారులు కూడా ముందుకు వస్తున్నారు. ఈ లైసెన్స్ ద్వారా బ్యాంకులు, ప్రభుత్వాల నుంచి రుణం తీసుకునేందుకు వీలుండడంతో పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపుతున్నారు.